kollywood: కోలీవుడ్‌లో నయా జోష్.. పోస్టు ప్రొడక్షన్ పనులకు తమిళనాడు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

  • టీవీ, సినిమాల పోస్టు ప్రొడక్షన్ పనులకు ప్రభుత్వం అనుమతి
  • గరిష్టంగా ఐదుగురితో పనులు చేసుకోవచ్చంటూ ఉత్తర్వులు
  • కృతజ్ఞతలు తెలిపిన నిర్మాతలు
Tamil Govt green signal to kollywood for post production works

తమిళ చిత్ర సీమకు అక్కడి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమాలకు పోస్టు ప్రొడక్షన్ పనులు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. లాక్‌డౌన్ కారణంగా దాదాపు రూ.500 కోట్ల మేర పెట్టుబడులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని, పోస్టు ప్రొడక్షన్ పనులకు అనుమతించాలని కోరుతూ ఇటీవల తమిళ నిర్మాతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్పందించిన ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్  ఇచ్చింది. ఈ నెల 11 నుంచి టీవీ, సినిమాలకు సంబంధించిన పోస్టు ప్రొడక్షన్ పనులు చేసుకోవచ్చంటూ నిన్న ఉత్తర్వులు విడుదల చేసింది.

గరిష్ఠంగా ఐదుగురితో ఎడిటింగ్, డబ్బింగ్, డీఐ, రీ రికార్డింగ్ సౌండ్ డిజైన్ /మిక్సింగ్ పనులు చేసుకోవచ్చని, వీఎఫ్ఎక్స్/సీజీఐ పనుల కోసం గరిష్టంగా 15 మందిని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అయితే, ఈ విషయంలో ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించడం తప్పనిసరని, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడం వంటి వాటిని విధిగా పాటించాలని సూచించింది. పోస్టు ప్రొడక్షన్ పనులకు అనుమతినిచ్చిన ప్రభుత్వానికి నిర్మాతలు కృతజ్ఞతలు తెలిపారు.

More Telugu News