Vizag: విశాఖలోని ఎల్జీ పాలిమర్స్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. పలువురి అరెస్టు!

  • తమకు న్యాయం చేయాలంటూ పరిశ్రమ వద్ద గ్రామస్థుల ధర్నా
  • పరిశ్రమను వేరే ప్రాంతానికి తరలించాలని డిమాండ్
  • కాసేపట్లో పరిశ్రమ వద్దకు డీజీపీ గౌతమ్ సవాంగ్
ruckus in vizag

విశాఖపట్నంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ వద్ద ఆర్‌ఆర్‌ వెంకటాపురం గ్రామస్థులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గ్యాస్‌ లీక్‌ ఘటనతో ఆ గ్రామానికి చెందిన పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పశువులు కూడా పెద్ద ఎత్తున మృతి చెందాయి.  తమకు న్యాయం చేయాలంటూ పరిశ్రమ వద్ద గ్రామస్థులు ధర్నా చేస్తున్నారు.

అలాగే, ఆ పరిశ్రమను అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ పరిశ్రమను ఇక్కడ నుంచి తరలించే వరకు తమ ఆందోళనను విరమించబోమని గ్రామస్థులు మీడియాకు తెలిపారు.

ఇదిలావుంచితే, పరిశ్రమ వద్దకు కాసేపట్లో డీజీపీ గౌతమ్ సవాంగ్‌ రానున్నారు. అక్కడి పరిస్థితిని సమీక్షించి, గ్యాస్‌లీక్‌ ఘటనలో అస్వస్థతకు గురయిన పోలీసులను ఆయన పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ పరిశ్రమ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వందలాది మంది స్థానికులు పరిశ్రమ వద్దకు చేరుకుంటున్నారు. తమను అడ్డుకుంటున్న పోలీసులతో స్థానికులు వాగ్వివాదానికి దిగారు.

More Telugu News