Vizag Gas Leak: వైజాగ్ వాసులను వీడని విషవాయువు భయం .. బాధితుల్లో ఇప్పుడు కొత్త సమస్యలు

  • కమిలిపోతున్న శరీరం
  • చిన్నారుల్లో న్యూమోనియా లక్షణాలు
  • కాలేయ, కిడ్నీ పరీక్షలు చేస్తున్న వైద్యులు
Vizag people suffering from skin diseases

విశాఖపట్టణంలో గ్యాస్ లీకేజీ దుర్ఘటన జరిగి మూడు రోజులు అవుతున్నా విషవాయువు ఇంకా జనాన్ని వెంటాడుతూనే ఉంది. గ్యాస్ పీల్చి అస్వస్థతకు గురై కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను ఇప్పుడు ఇతర సమస్యలు చుట్టుముడుతున్నాయి.

ఈ ఘటనలో 554 మంది బాధితులుగా మిగలగా వీరిలో 52 మంది చిన్నారులే ఉన్నారు. తాజాగా, బాధితుల్లో కొందరికి ఒంటిపై బొబ్బలు వస్తుండగా, చిన్నారుల్లో జ్వరం, న్యూమోనియా వంటి లక్షణాలు బయటపడుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. తొలుత శరీరంపై దురద, మంట పుడుతున్నాయి. ఆ తర్వాత చర్మం కమిలిపోయి బొబ్బలు వస్తున్నాయి.

దీంతో చర్మవ్యాధుల నిపుణులు వారికి చికిత్స అందిస్తున్నారు. మరికొందరు బాధితులు తాము ఆహారం తీసుకోలేకపోతున్నామని చెబుతున్నారు. దీంతో స్పందించిన వైద్యులు వారికి కిడ్నీ, కాలేయ పనితీరుకు సంబంధించిన పరీక్షలు చేస్తున్నారు.

More Telugu News