ఈ ఏడాది చివరి వరకు గూగుల్, ఫేస్ బుక్ ఉద్యోగులలో చాలామందికి ఇంటి నుంచే పని!
- కరోనా ధాటికి ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ పరిస్థితులు
- ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని కోరుతున్న సంస్థలు
- ఇప్పట్లో సాధారణ పరిస్థితులు ఉండవని భావిస్తున్న గూగుల్, ఫేస్ బుక్
ఫేస్ బుక్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఆఫీసులను మూసేసింది. జూలై 6 నాటికి కూడా ఫేస్ బుక్ కార్యాలయాలు తెరుచుకోవడం కష్టమేననిపిస్తోంది. దాంతో ఈ సంవత్సరం మొత్తం ఇంటి నుంచే పని చేసుకోవచ్చంటూ ఉద్యోగులకు సూచించామని ఫేస్ బుక్ ప్రతినిధి ఒకరు తెలిపారు. గూగుల్ పరిస్థితి కూడా అందుకు భిన్నం కాదు.
ఇటీవలే జరిగిన సంస్థాగత సమావేశంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇదే తరహాలో స్పందించారు. ఈ ఏడాదిలో మిగిలిన భాగం అంతా ఇంటి నుంచి పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాదు, గూగుల్ మరో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా గూగుల్ ఉద్యోగులకు వేతనంలో భాగంగా అనేక ప్రోత్సాహకాలు ఉంటాయి. అయితే, ఇంటి నుంచి పనిచేసే కాలంలో ఈ ప్రోత్సాహకాలను నిలిపివేయాలని సంస్థ నిర్ణయించినట్టు సమాచారం.