Nagma: భారత్ పై విషం కక్కిన పాక్ జర్నలిస్టుకు మద్దతు పలికిన నగ్మా.. నెటిజన్ల విమర్శలు

  • ఓ చర్చలో పాల్గొన్న నగ్మా, పాక్ జర్నలిస్టు తరీఖ్ పీర్జాదా
  • భారత్ పై విరుచుకుపడ్డ తరీఖ్..అడ్డుచెప్పని నగ్మా
  • పైగా సదరు జర్నలిస్ట్ కు మద్దతు పలుకుతూ ఆమె ట్వీట్
Netigens lashes out Congress leader Nagma for supporting Pak journalist

భారత్ పై తన ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ జర్నలిస్టుకు వత్తాసు పలుకుతూ మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, సినీ నటి నగ్మా వివాదాల్లో చిక్కుకున్నారు. ‘మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలు’ పేరిట ఒక హిందీ టీవీ ఛానెల్ రెండు రోజుల క్రితం చర్చా కార్యక్రమం నిర్వహించింది.

ఈ చర్చా కార్యక్రమంలో నగ్మా, పాక్ జర్నలిస్టు తరీఖ్ పీర్జాదా పాల్గొన్నారు. పాక్ ను పొగుడుతూ.. భారత్ ను కించపరుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు శ్రుతి మించడంతో సదరు ఛానెల్ వ్యాఖ్యాత అడ్డుతగిలారు. అయితే, భారత్ పై విషం కక్కుతూ వ్యాఖ్యలు చేసిన పీర్జాదాను ఎండగట్టాల్సింది పోయి వ్యాఖ్యాతపై నగ్మా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ జర్నలిస్ట్ ను కించపరిచేందుకే ఈ చర్చా కార్యక్రమం నిర్వహించారా? అంటూ ఆ వ్యాఖ్యాతను ఆమె ప్రశ్నించారు. అంతేకాకుండా, ఈ చర్చా కార్యక్రమం అనంతరం పాక్ జర్నలిస్ట్ కు మద్దతుగా ఆమె ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ను చూసిన నెటిజన్లు నగ్మాపై విరుచుకుపడుతున్నారు. ఇలాంటి చర్యలతో తన గౌరవాన్నే కాదు, పార్టీ గౌరవాన్నీ నగ్మా మంటగలుపుతోందంటూ విమర్శలు చేస్తున్నారు.

More Telugu News