Andhra Pradesh: పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం.. ప్రియుడి మోజులో పడి భర్తను అంతమొందించిన భార్య

  • నిద్రపోతున్న భర్తను రాడ్డుతో కొట్టి హతమార్చిన భార్య
  • ఉరిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి విఫలం
  • భయపడి పరారీ
wife killed husband in Eluru

ప్రియుడి మోజులో పడిన ఓ వివాహిత భర్తను దారుణంగా హతమార్చింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. గుడిపూడి నాగరాజు (38), భూలక్ష్మి భార్యాభర్తలు. ఏడేళ్ల క్రితం వీరికి వివాహమైంది. తాపీ మేస్త్రీ అయిన నాగరాజు కుటుంబంతో కలిసి పెదపాడు మండలంలోని వట్లూరులో నివాసం ఉంటున్నాడు.

అదే గ్రామానికి చెందిన తోకల సురేష్.. నాగరాజు వద్ద పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో నాగరాజు భార్య భూలక్ష్మితో అతడికి వివాహేతర సంబంధం ఏర్పడింది. అతడికి బాగా దగ్గరైన భూలక్ష్మి భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది.

ఈ నెల 6న ప్రియుడు సురేష్‌తో కలిసి పథకాన్ని అమలు చేసింది. రాత్రి ఇంట్లో నిద్రపోతున్న భర్తను ఇద్దరూ కలిసి రాడ్డుతో తలపై మోది హతమార్చారు. అనంతరం హత్యను ఉరిగా మార్చేందుకు ప్రయత్నించి అక్కడి నుంచి పరారయ్యారు. ఉదయం నాగరాజు మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News