West Godavari District: ఊహించని దారుణం.. భార్యను బెదిరించబోయి ప్రాణాలు కోల్పోయిన భర్త!

  • పశ్చిమ గోదావరి జిల్లా మలకపల్లిలో ఘటన
  • కువైట్ వెళ్లిన భార్యను వెనక్కి రప్పించేందుకు ఉరి నాటకం
  • ప్రమాదవశాత్తు తాడు బిగుసుకోవడంతో మృతి
A husband who lost his life to warn his wife

పశ్చిమ గోదావరి జిల్లాలో అనుకోని దారుణం ఒకటి జరిగింది. భార్యను బెదిరించే క్రమంలో ఓ భర్త ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఈ మొత్తం ఘటన అతడి సెల్‌ఫోన్‌లో రికార్డు అయింది. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని తాళ్లపూడి మండలం మలకపల్లికి చెందిన జి.గణేశ్ (35) భార్య ఐదు నెలల క్రితం కువైట్ వెళ్లి పనికి కుదిరింది.

అక్కడి నుంచి వచ్చేయాలంటూ ఇటీవల భార్యను గణేశ్ కోరుతున్నాడు. ఆదివారం ఆమెకు ఫోన్ చేసి వెంటనే వచ్చేయాలని కోరాడు. రాకుంటే ఉరేసుకుని చనిపోతానని బెదిరించాడు. అక్కడితో ఆగక ఫ్యాన్‌కు తాడు బిగించి ఉరేసుకుంటున్నట్టు నటించాడు. అయితే, ప్రమాదవశాత్తు తాడు బిగుసుకోవడంతో గణేశ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ మొత్తం ఘటన అతడి సెల్‌ఫోన్‌లో రికార్డయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News