Cyger Criminals: రెండు స్నాక్స్ ప్యాకెట్ల కోసం రూ.2.25 లక్షలు సమర్పించుకున్న బిజినెస్ మేన్!

  • లాక్ డౌన్ నేపథ్యంలో సైబర్ మోసం
  • మోసగాళ్లను నమ్మి బ్యాంకు ఖాతా వివరాలు అందించిన వ్యాపారి
  • అందినకాడికి ఊడ్చిన సైబర్ నేరగాళ్లు
Cyber criminals targets a businessman

కరోనా లాక్ డౌన్ సందట్లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇంటర్నెట్లో నకిలీ హెల్ప్ లైన్ నంబర్లు ఉంచి, తద్వారా అమాయకులకు కుచ్చు టోపీ పెడుతున్నారు. ముంబయిలో ఓ బిజినెస్ మేన్ మోసగాళ్లను నమ్మి లక్షలు సమర్పించుకున్నాడు. ఆన్ లైన్ ద్వారా నిత్యావసరాలు ఆర్డర్ చేయొచ్చన్న ఓ ప్రకటన చూసి హెల్ప్ లైన్ కోసం ఇంటర్నెట్లో వెతికాడు. అప్పటికే సైబర్ నేరగాళ్లు ఉంచిన ఓ నకిలీ నంబర్ చూడడం అతడి దురదృష్టం అని చెప్పాలి. ఆ నెంబర్ కు ఫోన్ చేసి రెండు స్నాక్స్ ప్యాకెట్లు ఆర్డర్ చేశాడు. వాటి ఖరీదు రూ.400.

అయితే, ఆ రెండు ప్యాకెట్లు ఎంతకీ డెలివరీ కాకపోవడంతో మళ్లీ అదే నంబర్ కు ఫోన్ చేయగా, కాచుకుని ఉన్న మోసగాళ్లు ఎంతో తెలివి అతడి నుంచి బ్యాంకు అకౌంట్ వివరాలు రాబట్టారు. అతడి ఫోన్ కు ఓ లింకును పంపి తమ పని పూర్తిచేశారు. వాళ్లను నమ్మిన ఆ బిజినెస్ మేన్ కు కాసేపట్లోనే తానెంత మోసపోయిందీ అర్థమైంది. అతని బ్యాంకు అకౌంట్ నుంచి ఒక్కసారిగా రూ.2.25 లక్షలు గల్లంతయ్యాయి. దాంతో లబోదిబోమన్న వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న ముంబయి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News