Asaduddin Owaisi: లాక్ డౌన్ విషయంలో.. మోదీ ఏ మాత్రం ఆలోచించకుండా వ్యవహరించారు: ఒవైసీ

  • వలస కూలీల పరిస్థితి చాలా దారుణంగా ఉంది
  • సొంత ఇళ్లకు కూడా చేరుకోలేని దీన స్థితిలో ఉన్నారు 
  • వలస కార్మికులకు ఆధార్ నంబర్ ప్రకారం సాయం చేయాలి
Modi announced lockdown without any plan says Owaisi

లాక్ డౌన్ ను ప్రకటించే ముందు ప్రధాని మోదీ ఏమాత్రం ఆలోచించలేదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. ఎలాంటి ప్లానింగ్ లేకుండా లాక్ డౌన్ ను ప్రకటించారని అన్నారు. వలస కార్మికుల పరిస్థితిని పట్టించుకోలేదని చెప్పారు. పశ్చిమబెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో వలస కూలీల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. లాక్ డౌన్ భయంతో కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వలస కార్మికుల్లో ఎక్కువ మందికి రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నంబర్ లేవని ఒవైసీ చెప్పారు. ఇలాంటి వారికి ఆధార్ నంబర్ ఆధారంగా సాయం చేయాలని సూచించారు. గోడౌన్లలో నిలువ చేసిన బియ్యాన్ని ప్రజలకు పంపిణీ చేయాలని అన్నారు. తెలంగాణ నుంచి ఛత్తీస్ గఢ్ కు బయల్దేరిన 12 ఏళ్ల అమ్మాయి 100 కిలోమీటర్లకు పైగా నడిచి... తీవ్ర అలసటతో కన్ను మూసిందని అన్నారు. సొంత ఇళ్లకు చేరుకోలేని దయనీయమైన పరిస్థితిలో ఉన్నారని చెప్పారు. కేంద్రం ఆమోదం తెలిపిన రూ. 30 వేల కోట్ల సెంట్రల్ విస్టా ప్రాజెక్టును ఆపేసి... ఆ మొత్తాన్ని కష్టాల్లో ఉన్న ప్రజలకు పంచాలని సూచించారు.

లాక్ డౌన్ ముగిసిన తర్వాత వలస కార్మికుల పరిస్థితి ఏమిటని ఒవైసీ ప్రశ్నించారు. ఉద్యోగాలను కోల్పోయిన వారికి మళ్లీ వారి ఉద్యోగాలు వస్తాయా? అని అడిగారు.

More Telugu News