AIIMS: సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లిన 40 మంది ఢిల్లీ డాక్టర్లు, వైద్య సిబ్బంది

  • ఎయిమ్స్ లో పని చేస్తున్న మేల్ నర్సుకు కరోనా నిర్ధారణ
  • అక్కడి మొత్తం సిబ్బందికి సెల్ఫ్ క్వారంటైన్ 
  • వార్డులోని రోగులందరికీ కరోనా టెస్టులు
40 AIIMS staff gone to self quarantine

ఢిల్లీ ఎయిమ్స్ లో గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో పని చేస్తున్న ఓ మేల్ నర్సుకు (30) కరోనా సోకినట్టు నిర్ధారణ కావడం అలజడి రేపింది. వెంటనే అక్కడ పని చేస్తున్న మరో 40 మంది డాక్టర్లు, వైద్య సిబ్బంది సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లిపోయారు. మరోవైపు సదరు మేల్ నర్స్ పని చేసే వార్డులోని రోగుల శాంపిళ్లను కూడా సేకరించి పరీక్షలకు పంపారు. వీరిలో ఇప్పటి వరకు 22 మంది రిపోర్టులు రాగా... అందరికీ నెగెటివ్ అని తేలింది. మిగిలిన వారి రిపోర్టుల కోసం ఎదురు చూస్తున్నారు.

కరోనా బారిన పడిన మేల్ నర్స్ తనకు జ్వరంగా ఉందంటూ గత శనివారం ఫోన్ ద్వారా వైద్యులను సంప్రదించాడు. సోమవారం హాస్పిటల్ కు వచ్చి టెస్టులు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. సోమవారం నాడు డ్యూటీ ఉండటంతో... బుధవారం నాడు టెస్టులు చేయించుకున్నాడు. కరోనా సోకినట్టు అదే రోజు రాత్రి రిపోర్టు వచ్చింది. మరుసటి రోజు (గురువారం) ఈ విషయం అందరికీ తెలిసింది. ప్రస్తుతం అతను ఎయిమ్స్ లోనే చికిత్స పొందుతున్నాడు. అతనికి కరోనా సోకడంతో... అతను పని చేస్తున్న గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలోని మొత్తం సిబ్బందిని సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లాలని అధికారులు సూచించారు. దీంతో, వారంతా క్వారంటైన్ కు వెళ్లారు.

More Telugu News