Plasma Therapy: ప్లాస్మా థెరపీ పని చేస్తోంది: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

  • ఢిల్లీలో నలుగురు రోగులపై ప్రయోగం
  • కోలుకొని డిశ్చార్జికి సిద్ధమైన ఇద్దరు
  • కనీసం పది మంది కోలుకుంటేనే ఉత్తమ ఫలితంగా గుర్తిస్తాం
Arvind Kejriwal says plasma therapy encouraging

కరోనా వైరస్‌కు మందులు, టీకాలు కనుగొనేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైరస్ బాధితులకు ఇప్పటిదాకా నిర్ధారిత చికిత్స అంటూ ఏమీ లేదు. అయితే, ప్లాస్లా థెరపీ విధానంతో చికిత్స అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కరోనా రోగులపై  ఈ థెరపీ పని చేస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. తమ రాష్ట్రంలోని కరోనా రోగులపై ప్లాస్మా థెరపీ ప్రయోగాలతో సానుకూల ఫలితాలు వస్తున్నాయని చెప్పారు.

ట్రయల్స్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఢిల్లీలోని లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ ఆసుపత్రిలో నలుగురు రోగులపై ప్రయోగాలు నిర్వహించామన్నారు. వీరిలో ఇద్దరు కోలుకొని డిశ్చార్జి కావడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రస్తుతానికి ఈ ట్రయల్స్‌ విషయంలో మంచి ఫలితాలే వస్తున్నాయని అన్నారు. కానీ, ఇవి ప్రాథమిక ఫలితాలు మాత్రమే అని, వైరస్‌కు పూర్తి చికిత్స కాదని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

ఈ చికిత్స ద్వారా కనీసం పదిమంది కోలుకోగలిగితేనే ఉత్తమ ఫలితంగా గుర్తిస్తామని చెప్పారు. కాగా, ప్రస్తుతం మరో ఇద్దరు, ముగ్గురికి సరిపడా రక్తం, ప్లాస్మా సిద్దంగా వున్నాయని వైద్యాధికారులు తెలిపారు. అత్యవసర చికిత్స అవసరమయ్యే పరిస్థితులలో వున్న రోగులకు ప్లాస్మా థెరపీ చేస్తామని వెల్లడించారు.

More Telugu News