yediyurappa: కుమార స్వామి కుమారుడు నిఖిల్ గౌడ పెళ్లిపై సీఎం యడియూరప్ప ఆసక్తికర వ్యాఖ్యలు

  • ఆ పెళ్లిపై సానుకూలంగా వ్యాఖ్యలు
  • ఆ పెళ్లి గురించి చర్చించాల్సిన అవసరమేమీ లేదు
  • అవసరమైన అనుమతులన్నీ ఇచ్చాం
  • ఆ వివాహం కూడా చాలా సింపుల్‌గానే జరిగింది
yediyurappa on nikhilmarriage

కాంగ్రెస్ మాజీ నాయకుడు కృష్ణప్ప మనవరాలు రేవతిని కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ ఇటీవల వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు అమలు అవుతున్న కారణంగా పెళ్లి వేదికను బెంగళూరు నుంచి రాంనగరలోని ఫామ్ హౌస్ కు మార్చి, అనుమతులు తీసుకుని ఈ పెళ్లి జరిపించారు.

ఈ పెళ్లికి సుమారు 60 మంది కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. అయితే, ఈ పెళ్లి నేపథ్యం కుమారస్వామి కుటుంబంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అందరికీ ఆదర్శంగా ఉండాల్సిందిపోయి ఇలా వ్యవహరించడమేంటని చాలా మంది ప్రశ్నించారు.

దీనిపై కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప స్పందిస్తూ, ఆ పెళ్లిపై సానుకూలంగా వ్యాఖ్యానించారు. ఆ పెళ్లి గురించి చర్చించాల్సిన అవసరమేమీ లేదని, ఇందుకోసం అవసరమైన అనుమతులన్నీ ఇచ్చామని తెలిపారు. ఆ వివాహం కూడా చాలా సింపుల్‌గానే జరిగిందని వివరణ ఇచ్చారు.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో వారి పరిమితుల్లో బాగానే చేశారని అన్నారు. అందుకు తాను వారిని అభినందిస్తున్నాని కూడా యడియూరప్ప అనడం గమనార్హం. కాగా, ఈ వివాహంపై పూర్తి నివేదిక ఇవ్వాలంటూ రాంనగర్‌ డిప్యూటీ కమిషనర్‌కు యడియూరప్ప ఆదేశాలు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే.

More Telugu News