Police: యూపీలో.. కరోనా అనుమానితుల్ని తీసుకెళ్లేందుకు వచ్చిన వైద్య సిబ్బందిపై రాళ్లదాడి

  • ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఘటన
  • దాడిలో అంబులెన్స్, పోలీసు వాహనాల ధ్వంసం
  • పోలీసులు, వైద్య సిబ్బందికి గాయాలు
Locals attack medical team and police in Uttarpradesh

కరోనా అనుమానితుల్ని తీసుకెళ్లేందుకు వచ్చిన పోలీసులు, వైద్య సిబ్బందిపై స్థానికులు రాళ్లు, ఇటుకలతో దాడిచేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో జరిగిందీ ఘటన. స్థానిక నవాబ్‌పురా కాలనీలో ఇద్దరు కరోనా అనుమానితులు ఉన్నట్టు వైద్యులకు సమాచారం అందింది. దీంతో వారిని తీసుకెళ్లేందుకు పోలీసులతో కలిసి వైద్య సిబ్బంది అంబులెన్స్‌లో అక్కడికి చేరుకున్నారు.

వారి రాకను గమనించిన స్థానికులు అంబులెన్స్, పోలీసు వాహనాలపై రాళ్లు, ఇటుకలతో దాడిచేశారు. ఈ ఘటనలో వాహనాలు ధ్వంసం కాగా, పోలీసులు, వైద్య సిబ్బందికి గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన 10 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, మరికొందరి కోసం గాలిస్తున్నారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా స్పందించారు. దాడికి పాల్పడిన వారిపై జాతీయ భద్రత చట్టం కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. దాడి కారణంగా జరిగిన ఆస్తి నష్టాన్ని వారి నుంచే భర్తీ చేయాలని సూచించారు.

More Telugu News