Karnataka: లాక్‌డౌన్ పొడిగింపుతో మనస్తాపం.. ఉరివేసుకుని పూజారి ఆత్మహత్య

  • ముంబైలోని దుర్గామాత ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న కర్ణాటక వ్యక్తి
  • లాక్‌డౌన్ ఎత్తివేస్తే ఇంటికి వెళ్లాలని నిర్ణయం
  • ప్రధాని ప్రకటన తర్వాత ఇంటికెళ్లే మార్గం కనిపించక తీవ్ర నిర్ణయం
Karnataka Man Suicide in Mumbai

దేశంలో లాక్‌డౌన్ పొడిగించడంతో మనస్తాపం చెందిన ఓ పూజారి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబైలో జరిగిందీ ఘటన. కర్ణాటకలోని ఉడుపి పట్టణానికి చెందిన కృష్ణ.. ముంబైలోని కండివలీ ప్రాంతంలోని దుర్గామాత ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు. సహచర పూజారులతో కలిసి ఓ ఇంట్లో నివసిస్తున్నాడు.

లాక్‌డౌన్ నేపథ్యంలో గత 21 రోజులుగా ముంబైలోని గదికే పరిమితమైన కృష్ణ.. నిన్నటితో లాక్‌డౌన్ గడువు ముగిసిపోతుందని భావించాడు. లాక్‌డౌన్ ఎత్తివేసిన వెంటనే ఉడుపి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు.

అయితే, కరోనా వైరస్‌ ప్రభావం దేశంలో రోజురోజుకు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను వచ్చే నెల 3 వరకు పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ నిన్న ప్రకటించారు. దీంతో ఇంటికి వెళ్లే మార్గం కనిపించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కృష్ణ గదిలోని కిచెన్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News