Lockdown: లాక్ డౌన్ ఇలాగే కొనసాగితే కష్టమే... హోమ్ శాఖకు వాణిజ్య శాఖ లేఖ!

  • వాణిజ్య కార్యకలాపాలకు అనుమతించండి
  • కొంతమేరకు లాక్ డౌన్ నిబంధనలు సడలించాలి
  • లేఖలో కోరిన వాణిజ్య శాఖ కార్యదర్శి
commerce Ministry Letter to Home Ministry Over Lockdown

కరోనా వైరస్ ను అడ్డుకునేందుకు లాక్ డౌన్ అనివార్యమే అయినప్పటికీ, ఇప్పుడు అమలు చేస్తున్న నిబంధనలను కొనసాగిస్తే, మాత్రం దేశం తీవ్రంగా నష్టపోతుందని, లాక్ డౌన్ నిబంధనలను సడలించి, వాణిజ్య కార్యకలాపాలను కొనసాగించుకునేందుకు అనుమతించాలని కేంద్ర వాణిజ్య శాఖ కోరింది. ఈ మేరకు కొన్ని సలహాలు, సూచనలతో హోమ్ శాఖకు ఓ లేఖను రాసింది. రక్షణాత్మక చర్యలు పూర్తి స్థాయిలో తీసుకుంటూ, వాహన, టెక్స్ టైల్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఫ్యాక్టరీలను తిరిగి తెరిచేందుకు అనుమతించాలని సిఫార్సు చేసింది.

కాగా, ఇప్పటికే 21 రోజులు అమలైన లాక్ డౌన్ ను నెలాఖరు వరకూ పొడిగిస్తూ, నేడు ప్రధాని మోదీ నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలుస్తున్న వేళ, వాణిజ్య శాఖ లేఖ రాయడం గమనార్హం. "లాక్ డౌన్ పై తుది నిర్ణయం తీసుకునే ముందు మా సలహాలు పరిశీలించడం. జాతీయ ఆర్థిక వ్యవస్థను రక్షించుకునేందుకు, ప్రజల వద్ద ద్రవ్య లభ్యత పెంచేందుకు కొన్ని సడలింపులు ఉండాలి" అని వాణిజ్య శాఖ కార్యదర్శి గురు ప్రసాద్ మోహపాత్రా సంతకంతో కూడిన లేఖ పేర్కొంది.

వ్యవసాయ శాఖ సైతం ఇదే విధమైన సూచనలతో హోమ్ మంత్రిత్వ శాఖను కోరి వుండవచ్చని, వ్యవసాయం అత్యంత కీలకమని, పంట చేతికి వచ్చే ఈ సమయంలో వ్యవసాయ కార్యకలాపాలకు ఆటంకం లేకుండా చూడాల్సివుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు, పరిశ్రమల ప్రతినిధులతో సంప్రదించిన తరువాత, సామాజిక దూరం పాటిస్తూ, ఉద్యోగులకు శానిటైజర్లు అందుబాటులో ఉంచి పరిశ్రమలు తెరచుకునే వీలు కల్పించాలని కోరారు.  ఇప్పటికే భారత్ లో ఆర్థిక వృద్ధి ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోయిందని, కరోనా మహమ్మారి ప్రభావంతో అది మరింతగా కుదించుకుపోకుండా చర్యలు చేపట్టాలని సిఫార్సు చేశారు.

More Telugu News