cuddpha: వేధిస్తోందని అత్తను కడతేర్చిన కోడలు.. పదకొండు నెలల తర్వాత వెలుగుచూసిన దారుణం

  • తల్లితో కలిసి కిరాతంగా హత్య 
  • రాజంపేటలో అప్పట్లో సంచలనం రేపిన ఘటన 
  • కొడుకు ఫిర్యాదుతో నిందితులను గుర్తించిన పోలీసులు
daughter in law murdered mother in law

నిత్యం అత్త వేధిస్తోందని ఆమెపై కక్ష పెంచుకుంది కోడలు. విషయాన్ని తల్లి చెవిలో వేసింది. ఆమెను అడ్డుతొలగించుకుంటే ఏ సమస్యా ఉండదని ఆమె చెప్పడంతో ఇద్దరూ కూడబలుక్కుని పథక రచన చేశారు. గుట్టుచప్పుడుకాకుండా చంపేసి ఏమీ తెలియనట్టు అందరితోపాటు శోకాలు పెట్టారు. కొడుకు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు పదకొండు నెలల అనంతరం కోడలు, ఆమె తల్లే నిందితులని తేల్చారు.

పోలీసుల కథనం మేరకు...కడప జిల్లా రాజంపేట పట్టణం ఎర్రబెల్లికి చెందిన సుమిత్రమ్మ (55) గత ఏడాది మే 3న దారుణ హత్యకు గురైంది. ఈమె కొడుకు మహీదర్ రెడ్డి. కోడలు శ్వేత. శ్వేతను సుమిత్రమ్మ నిత్యం వేధిస్తుండడంతో ఆమె రెండుసార్లు ఆత్మహత్యా యత్నం చేసింది. ఆ సందర్భంలో అత్త పెడుతున్న అగచాట్లు తల్లికి చెప్పి శ్వేత బోరుమనేది. దీంతో సుమిత్రమ్మను చంపేస్తే పీడ విరగడవుతుందని తల్లీ కూతుర్లు భావించారు.

అనంతపురం జిల్లా పశ్చిమ నడిమిపల్లిలోని దేవరపల్లి గ్రామానికి చెందిన కిరాయి హంతకులు ఓర్సు నాగరాజు, కొండ్ల వాల్లపల్లికి చెందిన మల్లెల రమేష్, మల్లికార్జునలను సంప్రదించి హత్యకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో వారు మే మూడవ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో సుమిత్రమ్మను దారుణంగా చంపేశారు.

ఈ ఘటన స్థానికంగా సంచలనం కాగా  శ్వేత, ఆమె తల్లి కూడా అందరిలాగే తమకే సంబంధం లేదన్నట్టు నటించేశారు. పాతకక్షల నేపధ్యంలో ఎవరో తన తల్లిని చంపేసి ఉంటారని భావించిన మహీధర్ రెడ్డి అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులకు కూడా ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో దర్యాప్తు ముందుకు సాగడం కష్టమైంది.

అయినా చాలెంజింగ్ తీసుకుని వేర్వేరు కోణాల్లో విచారించడంతో కోడలు, వియ్యపురాలే ఈ దారుణానికి ఒడిగట్టారని తేలింది. దీంతో శ్వేత, ఆమె తల్లితోపాటు కిరాయి హంతకులు నాగరాజు, మల్లికార్జున, రమేష్ ను అరెస్టు చేశారు. వారి నుంచి 62 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News