ఆనంద్ మహీంద్రా 'అరిటాకులో వడ్డన' ఆలోచన... ప్రశంసలు!
- లాక్ డౌన్ వేళ అరటి రైతుల ఇబ్బందులు
- తమ ఉత్పత్తులను విక్రయించలేక అవస్థలు
- క్యాంటీన్లలో అరిటాకులను ప్రవేశపెట్టిన ఆనంద్ మహీంద్రా
ఇంతకీ విషయం ఏంటంటే, రిటైర్డ్ జర్నలిస్ట్ పద్మా రామ్ నాథ్, ఆనంద్ మహీంద్రాకు ఓ ఈ మెయిల్ పంపిస్తూ, కరోనా కారణంగా, అరటి రైతులు తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు ఎంతో కష్టపడుతున్నారని, వారిని ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరారు. ఆ వెంటనే స్పందించిన ఆనంద్ మహీంద్రా తమ ఫ్యాక్టరీల్లోని క్యాంటీన్లలో సిబ్బందికి ప్లేట్లలో బదులు అరిటాకుల్లో భోజనం వడ్డించాలని, ఈ మేరకు రైతుల నుంచి ఆకులను కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఈ ఆలోచన కలిగేలా చేసినందుకు పద్మా రామ్ నాథ్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ఆపై తాను చేసిన చిరు సాయాన్ని ఫొటోలతో సహా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, తమ క్యాంటీన్లలో అరిటాకు భోజనం లభిస్తోందని తెలిపారు. ఆనంద్ ట్వీట్ ను వేలాది మంది లైక్ చేశారు. ఆయన సేవా తత్పరత అమోఘమని కొనియాడుతున్నారు. ఇక భోజనాలు చేస్తున్న సమయంలోనూ ఉద్యోగులు సామాజిక దూరాన్ని పాటిస్తూ ఉండటంతో ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.