ఐసీయూలో బ్రిటన్ ప్రధానికి చికిత్స!

Britain PM Boris Johnson now in ICU
  • గత నెల 26న కరోనా బారినపడిన ప్రధాని బోరిస్ జాన్సన్
  • స్వీయ నిర్బంధంలో ఉంటూ చికిత్స
  • అయినా తగ్గకపోవడంతో లండన్ ఆసుపత్రికి తరలింపు
కరోనా వైరస్ బారినపడిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోగ్యం నిన్న సాయంత్రానికి మరింత దిగజారింది. దీంతో ఆయనను ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మార్చి 26న ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో స్వీయ నిర్బంధంలో ఉంటూ చికిత్స తీసుకున్నారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోవడంతో వ్యక్తిగత వైద్యుడి సూచన మేరకు నిన్న లండన్ ఆసుపత్రిలో చేరారు. ప్రధాని ఆసుపత్రిలో చేరడంతో యూకే విదేశాంగ శాఖ కార్యదర్శి డొమినిక్ రాబ్ కరోనా సంబంధిత వ్యవహారాల బాధ్యతలు చూసుకుంటున్నారు.

నిన్న ఓ వీడియో సందేశాన్ని విడుదల చేసిన బోరిస్.. తన ఆరోగ్యం బాగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొన్నారు. తనలో ఇంకా కొద్దిపాటి వైరస్ లక్షణాలు ఉండడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం వల్లే ఆసుపత్రిలో చేరినట్టు తెలిపారు. మరోవైపు, ఇటలీ, స్పెయిన్‌లను కుదిపేసిన కరోనా వైరస్ ఇప్పుడిప్పుడే కొంత నెమ్మదిస్తోంది. కేసుల నమోదు క్రమంగా తగ్గుతోంది. అయితే, మరణాల సంఖ్య మాత్రం పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు, అమెరికాలో మాత్రం పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారుతోంది. ఇక్కడ ఇప్పటికే మరణాల సంఖ్య పదివేలు దాటిపోయింది. కోవిడ్ నిర్ధారిత కేసుల సంఖ్య 3.66 లక్షలు దాటింది.
Go Back to Shorts
Britain
Boris johnson
ICU
Corona Virus

More Telugu News