vaccine: కరోనాకు వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న భారత్​ బయోటెక్.. గుడ్​ లక్ చెప్పిన మంత్రి కేటీఆర్

  • కోరోఫ్లూ పేరుతో వ్యాక్సిన్ తయారు చేసే పనిలో సంస్థ
  • విస్కాన్‌సిన్ -మాడిసన్ యూనివర్సిటీ, ఫ్లూజెన్‌ కంపెనీతో కలిసి పరిశోధన
  • ముక్కు ద్వారా తీసుకునే 30 కోట్ల డోసులు అందివ్వాలని లక్ష్యం
My best wishes to  BharatBiotech  as they strive to develop a vaccine for  CoronaVirus says KTR

ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాక్సిన్ కంపెనీ భారత్ బయోటెక్‌కు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ‘కరోనా వైరస్ ను నిరోధించేందుకు కోరోఫ్లూ అనే పేరుతో వాక్సిన్‌ను అభివృద్ధి చేసే పనిలో ఉన్న మన హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్‌కు నా బెస్ట్ విషెస్. సీఎమ్‌డీ డాక్టర్ కృష్ణ ఎల్లా, ఆయన టీమ్‌కు గుడ్‌ లక్. మీ అందరూ విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని కేటీఆర్ ఈ రోజు ఉదయం ట్వీట్ చేశారు.

కరోనాకు వ్యాక్సిన్‌ తయారు చేయడం కోసం విస్కాన్‌సిన్-మాడిసన్ యూనివర్సిటీ, వ్యాక్సిన్ కంపెనీ ఫ్లూజెన్‌తో చేతులు కలిపినట్టు భారత్ బయోటెక్‌ తెలిపింది. ఆయా సంస్థలకు చెందిన వైరాలజిస్టులతో కలిసి ముక్కు ద్వారా తీసుకునే వ్యాక్సిన్ ‘క్లోరోఫ్లూ’ను అభివృద్ధి చేసి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. ఫ్లూజెన్ కంపెనీకి చెందిన  ఫ్లూ వ్యాక్సిన్ ఆధారంగా కరోనా కోసం టీకాను తయారు చేసే పనిలో ఉన్నామని చెప్పింది. ఫేజ్ 1, ఫ్లేజ్ 2 క్లినికల్ పరీక్షల దశలో ఉందని కంపెనీ బిజినెస్ డెవలప్‌మెంట్ అధిపతి రాచెస్ ఎల్లా తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ  చేసేందుకు 30 కోట్ల డోసులను తయారు చేస్తామని చెప్పారు.

‘కోరోఫ్లూ’ వ్యాక్సిన్‌పై యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్‌సిన్- మాడిసన్‌ వైరాజిస్టులు జంతువులపై పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఫలితాలు వచ్చేందుకు  మూడు నుంచి ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉంది.  ఈ  ఏడాది చివర్లో మనుషులపై  ప్రయోగాలు చేసే దశకు చేరుకోనుంది. వ్యాక్సిన్‌ పూర్తి స్థాయిలో అందుబాటులో వచ్చేందుకు దాదాపు ఏడాది సమయం పట్టొచ్చు.

More Telugu News