anushka sharma: కోహ్లీతో ఫొటో షేర్​ చేసి.. అనుష్క భావోద్వేగ సందేశం!

  • ప్రస్తుత పరిస్థితులను వివరించిన బాలీవుడ్ నటి
  • మనుషులుగా మనకేది ముఖ్యమో తెలిసొచ్చింది
  • ఎన్నో పాఠాలు నేర్పిందని వ్యాఖ్య
anushka sharma wrote heart touching message

కరోనా వైరస్ దెబ్బకు దేశం మొత్తం భయం భయంగా గడుపుతోంది. లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలంతా తమ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సమయంలో చాలా మంది తమ ఉపాధి కోల్పోయారు. ఈ పరిస్థితి మనుషులుగా మనకు నిజంగా ఏది ముఖ్యమో తెలియజేసిందని బాలీవుడ్ నటి అనుష్క శర్మ అభిప్రాయపడింది. భర్త విరాట్‌ కోహ్లీ, తమ పెంపుడు కుక్కతో తీసుకున్న ఓ ఆహ్లాదకరమైన ఫొటోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. అలాగే, ఇప్పుడున్న పరిస్థితులపై భావోద్వేగ సందేశం రాసింది.

‘ప్రతి చీకటి మబ్బులో ఓ వెండి రేఖ ఉంటుంది. ఈ సమయం మనకు చాలా చెత్తగా అనిపించొచ్చు. క్షణం తీరికలేకుండా గడుపుతూ, లేదా మనం బిజీగా ఉన్నామని చెప్పుకుంటున్న మనందరినీ  బలవంతగా ఆపేసింది. కానీ, ఈ సమయాన్ని మనం గౌరవిస్తే అది మనకెంతో వెలుగును పంచుతుంది. అలాగే, ఇప్పుడు మనకు ఏది ముఖ్యమో ఈ సమయం తెలియజేసింది. నాకైతే ఆహారం, నీళ్లు, గూడు, కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండటమే అత్యంత ముఖ్యమని అనిపిస్తోంది. మిగతావన్నీ బోనస్.

అందుకు నేను తల వంచుకొని కృతజ్ఞతలు చెబుతున్నా. అయితే, మనకు ప్రాథమిక అవసరాలు అనుకునే కొన్ని సౌకర్యాలు కూడా అందక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్లందరూ బాగుండాలని, క్షేమంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా. ఈ సమయంలోనే అందరం మనకు ఇష్టమైన వారితో కలిసి బలవంతంగా ఇంట్లో ఉండాల్సి వచ్చింది. అయితే, ఇది మనకు చాలా పాఠాలు నేర్పిస్తోంది’ అని అనుష్క వివరించింది.

More Telugu News