Grocery: మరో రెండు నెలల లాక్‌డౌన్‌ వదంతులతో భారీగా సరుకుల నిల్వ

  • దుకాణాలకు పరుగులు పెడుతున్న ప్రజలు
  • రెండు నెలలకు సరిపడా వస్తువుల కొనుగోలు
  • డిస్కౌంట్లు తగ్గించిన వర్తకులు
Grocery purchases increased amid lockdown rumors

దేశ వ్యాప్తంగా మరో రెండు నెలలు లాక్‌డౌన్‌ ఉంటుందని సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మి ప్రజలు నిత్యావసర సరుకులను భారీగా నిల్వ చేసుకుంటున్నారు. బియ్యం, పప్పులు, ఉప్పు, కారం, చింతపండు, మంచి నూనె, సబ్బులు తదితర వస్తువుల కొనుగోళ్లు పెరిగాయి. లాక్‌డౌన్ కొనసాగింపు వదంతులు నమ్మి దుకాణాలకు పరుగులు పెడుతున్నారు.

ప్రజలకు  అవసరమైన సరుకులు అందుబాటులో ఉన్నప్పటికీ.. కొంతమంది భయంతో రెండు నెలలకు సరిపడా ఇప్పుడే కొనుగోలు చేస్తున్నారు. దాంతో మున్ముందు సరుకుల కొరత ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది. సరుకులతో పాటు బీపీ, షుగర్, జ్వరం మాత్రలకూ గిరాకీ పెరిగింది. హోల్‌సేల్ మార్కెట్లు, దుకాణాలు, మాల్స్‌లో ప్రతి రోజూ నిల్వలు ఖాళీ అవుతున్నాయి. వాటి స్థానంలో కొత్తవి సర్దుబాటు చేస్తున్నారు.

కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు ముందస్తు వేతనాలు ఇచ్చాయి. జీతం రావడంతో నెలకు సరిపడా అవసరమైన వస్తువులు  ఒక్కసారే కొనుగోలు చేస్తున్నారు. డిమాండ్ పెరగడంతో కస్టమర్లకు ఇచ్చే డిస్కౌంట్లను మాల్స్‌, దుకాణాలు తగ్గించాయి. లాక్‌డౌన్‌కు ముందు వరకు కొన్ని వస్తువులపై 15 శాతం వరకూ డిస్కౌంట్ ఇవ్వగా ఇప్పుడు దాన్ని 5 శాతానికి తగ్గించాయి. చిల్లర వర్తకులు ఎలాంటి రాయితీ ఇవ్వడం లేదు. గరిష్ఠ ధరలకే వస్తువులు విక్రయిస్తున్నారు.

More Telugu News