Corona Virus: భారత్‌లో ‘కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌’ దశకు కరోనా చేరుకోలేదు: ఐసీఎమ్‌ఆర్

  • 2 వేల శాంపిల్స్‌ పరీక్షించి ఈ విషయం గుర్తించామని వెల్లడి
  • అయినా వైరస్‌ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందన్న కౌన్సిల్
  • దేశంలో 600 దాటిన బాధితుల సంఖ్య
2000 samples show no community transmission yet ICMR says

దేశంలో కరోనా వైరస్‌ రోజు రోజుకూ విజృంభిస్తోంది. లాక్‌ డౌన్ ప్రకటించినప్పటికీ కేసుల సంఖ్య ఆగడం లేదు. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడినవారి సంఖ్య 600 దాటింది. అయితే వైరస్ ఇంకా ‘కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌’ దశలోకి వెళ్లలేదని తెలియడం కాస్త ఊరటనిచ్చే అంశం. కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ అంటే వైరస్ సోకిన వ్యక్తిని కలవకపోయినా, కరోనా వ్యాపించిన దేశాల్లో పర్యటించకపోయినా ఓ వ్యక్తి వైరస్‌ బారిన పడడం.

ప్రస్తుతం నమోదైన కేసులన్నీ విదేశాల నుంచి వచ్చిన వారికి, వారితో కాంటాక్ట్ అయిన వారికి చెందినవే. ఇప్పటిదాకా కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ ద్వారా ఒక్క కేసు కూడా రాలేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్‌ఆర్) తమకు తెలియజేసిందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ప్రకటించారు. తాము పరీక్షించిన 2000 శాంపిల్స్‌లో ఈ విషయాన్ని గుర్తించినట్టు ఐసీఎమ్ఆర్ చెప్పిందన్నారు. అయితే, ఈ వైరస్‌ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని, అందువల్ల పరిస్థితిని ప్రతి రోజూ పర్యవేక్షించాల్సి ఉంటుందని చెప్పారు.

More Telugu News