Sensex: ఆ రెండు ప్రకటనలతో దూసుకుపోయిన షేర్ మార్కెట్లు!

  • కేంద్రం ప్యాకేజీ ప్రకటన వార్తలతో మార్కెట్లో జోష్
  • రికార్డు స్థాయిలో లాభపడిన సెన్సెక్స్
  • అమెరికా రెండు ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీకి సెనేట్ అనుమతితో మరింత బూస్ట్
Share Market News

ఉగాది వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. వరుసగా రెండో రోజు కూడా దేశీయ సూచీలు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ నేడు 1861.75 పాయింట్లు లాభపడి 28,535.78 వద్ద ముగియగా, నిఫ్టీ 516.80 పాయింట్లు పెరిగి 8,317 వద్ద ముగిసింది. అమెరికాలో ప్యాకేజీ అంశం ఓ కొలిక్కి రావడంతోపాటు కేంద్రం ప్యాకేజీ ప్రకటిస్తుందన్న ఊహాగానాలు మార్కెట్లలో జోష్ నింపాయి.

ఈ ఉదయం ప్రారంభమైన కాసేపటికే ట్రేడింగ్ లాభాల్లోకి దూసుకెళ్లింది. అదే సమయంలో అమెరికా ఆర్థిక వ్యవస్థకు రెండు ట్రిలియన్ డాలర్ల సాయం అందించే విషయంలో సెనేట్, వైట్‌హౌస్ ఓ అవగాహనకు రావడం మార్కెట్లలో బూస్ట్ నింపింది. మరోవైపు, కరోనా వైరస్ నేపథ్యంలో సామాన్యులు, చిరువ్యాపారులకు ఊరట కల్పించేలా త్వరలో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించనున్నట్టు కేంద్రం తెలిపింది. ఈ రెండు ప్రకటనలతో మార్కెట్లు లాభాల్లోకి దూసుకెళ్లాయి.  

నిఫ్టీలో రిలయన్స్, గ్రాసిమ్, కోటక్ మహీంద్ర, యూపీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు లాభపడ్డాయి. యస్ బ్యాంకు, ఇండస్ ఇండ్, కోల్ ఇండియా, ఐవోసీ, ఐటీసీ షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. మరోవైపు, సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్.. జియోలో వాటాలు కొనుగోలు చేయనుందనే ప్రచారంతో రిలయన్స్ షేర్లు దూసుకెళ్లాయి.

More Telugu News