jharkhand: కరోనా ఐసోలేషన్‌ వార్డులో డ్యూటీ.. భయంతో డాక్టర్ దంపతుల రాజీనామా!

  • జార్ఖండ్‌లో ఘటన
  • వాట్సప్‌లో రాజీనామా పంపిన వైనం
  • కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిక
  • వెనక్కి తగ్గిన వైద్యులు
doctors resign in jharkhand

కరోనా వైరస్‌కు వైద్యులు కూడా భయపడుతున్నారు. కరోనా రోగులు ఉండే ఐసోలేషన్ వార్డులో విధులు నిర్వర్తించమన్నారంటూ జార్ఖండ్‌లో డాక్టరు దంపతులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఆ విధుల్లో ఇతర వైద్యులను నియమించకుండా తమనే ఎందుకు నియమించాలని వారు ప్రశ్నించారు. పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలోని జంషడ్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనం రేపుతోంది.

ఆ ఆసుపత్రి సివిల్ సర్జన్ డాక్టర్ మంజూదూబే ఇందుకు సంబంధించిన వివరాలను తెలిపారు. తమ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ టిర్కీ, ఆయన భార్య డాక్టర్ సౌమ్యతో కలిసి తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తూ వాట్సప్‌, ఈ-మెయిల్ ల ద్వారా రాజీనామా లేఖను పంపించారని తెలిపారు. దీనిపై జార్ఖండ్‌ ప్రభుత్వం సీరియస్‌ అయింది.

ఆ వైద్యులిద్దరూ 24 గంటల్లో విధుల్లో చేరకపోతే రాష్ట్ర ఎపిడమిక్ డిసీజెస్ రెగ్యులేషన్ 2020, ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 1897 ప్రకారం వారిపై కేసు నమోదు చేస్తామని తెలిపింది. అంతేగాక, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రిజిస్ట్రేషన్ ను కూడా రద్దు చేయిస్తామని అల్టిమేటం జారీ చేసింది. దీనిపై స్పందించిన డాక్టర్‌ టిర్కీ... తన భార్య, సోదరి అనారోగ్యంతో బాధపడుతున్నారని రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నందుకే తాము ఉద్యోగాలకు రాజీనామా చేశామని చెప్పుకొచ్చాడు. తాను విధుల్లో చేరతానని, అయితే, నెలరోజుల తర్వాత కరోనాను నిరోధించాక ఉద్యోగాన్ని వదిలివేస్తామని అంటున్నాడు.

More Telugu News