T20 World Cup: రికార్డులు బద్దలు కొట్టిన మహిళల టీ20 ప్రపంచకప్

  • మహిళా క్రికెట్‌లో అత్యధిక మంది వీక్షించిన టోర్నీగా రికార్డు
  • 74.9 మిలియన్ల మంది  వీక్షకులు
  • ఫైనల్‌ మ్యాచ్‌ను చూసిన 9.9 మిలియన్ల అభిమానులు
2020 Womens T20 World Cup Overhauls Viewership Record In Womens Cricket

ఆస్ట్రేలియా వేదికగా ఈ నెల తొలివారంలో ముగిసిన మహిళల టీ20 ప్రపంచకప్ అరుదైన రికార్డు సృష్టించింది. మహిళల టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక మంది వీక్షించిన టోర్నీగా నిలిచింది. ఈ మెగా ఈవెంట్‌ను ప్రపంచ వ్యాప్తంగా 74.9 మిలియన్ల మంది వీక్షించారు. 2018 మహిళల టీ20 వరల్డ్‌కప్‌ కంటే ఇది రెట్టింపు. ఆ టోర్నీని 36.9 మంది ప్రేక్షకులు చూశారు.

తాజా వరల్డ్‌కప్‌ను 5.4 బిలియన్ నిమిషాలు వీక్షించారు. 2018 టోర్నీ (1.8 బిలియన్ నిమిషాలు) కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ కావడం విశేషం. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను అయితే 9.9 మిలియన్ల మంది వీక్షకులతో కొత్త రికార్డు సృష్టించింది. మహిళా క్రికెట్‌లో అత్యధిక మంది చూసిన పోరు ఇదే.

ఎంసీజీ మైదానంలో జరిగిన టైటిల్ ఫైట్‌ను 86,174 మంది ప్రత్యక్షంగా చూశారు. ఇది కూడా ఒక రికార్డే. అయితే, ఈ మ్యాచ్‌లో భారత్ చిత్తుగా ఓడిపోయింది. 85 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించిన ఆసీస్‌ ఐదోసారి విశ్వవిజేతగా నిలిచింది.

More Telugu News