Janata Curfew: 'జనతా కర్ఫ్యూ' నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం

  • ఆదివారం జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన ప్రధాని మోదీ
  • శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి 10 గంటల వరకు రైళ్లు నిలిపివేత
  • దేశవ్యాప్తంగా నిలిచిపోనున్న 2400 రైళ్లు
Indian Railways decides to stop all passenger train on Janata Curfew day

ఈ నెల 22న ప్రజలందరూ స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు నిచ్చిన నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించాలంటే ప్రజలందరూ 14 గంటల పాటు ఇళ్లకే పరిమితం కావాలని మోదీ సూచించారు.

ఈ కార్యక్రమానికి తమవంతు సహకారంగా రైల్వే శాఖ దేశవ్యాప్తంగా రైళ్లను నిలిపివేయాలని నిర్ణయించింది. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి 10 గంటల వరకు ప్రయాణికుల రైళ్లను రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లను, ఇప్పటికే మార్గమధ్యంలో ఉన్న రైళ్లను అందుకు మినహాయించారు.

కాగా, రైల్వే శాఖ నిర్ణయంతో దేశవ్యాప్తంగా 2,400 రైళ్లు నిలిచిపోతాయి. ఇప్పటికే రైల్వే శాఖ 200 రైళ్లను రద్దు చేయగా, రూ.450 కోట్ల మేర నష్టం చవిచూసింది. రైలు ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో ఈ నష్టం మరింత తీవ్రతరం కానుందని అంచనా!

More Telugu News