Hyderabad: విదేశాల నుంచి దిగగానే నేరుగా క్వారంటైన్ కేంద్రాలకు... హైదరాబాద్ లో కఠినంగా అమలు!

  • దిగగానే పాస్ పోర్టులు స్వాధీనం
  • పారిపోకుండా ఏసీపీ స్థాయి అధికారి కాపలా
  • రద్దవుతున్న పలు విమానాలు
Direct Quarantine for Foreign Travelers

కరోనా వైరస్ కేవలం విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల ద్వారానే వ్యాపిస్తోందని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం, కొన్ని కఠిన నిర్ణయాలను ప్రకటించింది. విదేశీ ప్రయాణికులు విమానం దిగగానే, వారిని క్వారంటైన్ కేంద్రాలకు పంపిస్తోంది. గడచిన రెండు రోజుల వ్యవధిలో మొత్తం 1,160 మందిని ఈ సెంటర్లకు తరలించినట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

వారు ల్యాండ్ కాగానే తొలుత థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేసి, ఆపై పాస్ పోర్టులను స్వాధీనం చేసుకుని క్వారంటైన్ స్లిప్స్ అందిస్తున్నారు. ఇక వారు ఎక్కడికీ పారిపోకుండా క్వారంటైన్ కేంద్రాల వద్ద ఏసీపీ స్థాయి అధికారిని ఇన్ చార్జ్ గా నియమించారు. ధూలపల్లి, వికారాబాద్, గచ్చిబౌలి స్టేడియం, ఎంసీఆర్‌ హెచ్‌ఆర్డీ, రాజేంద్రనగర్‌ ఎన్‌ఐఆర్‌డీ, నారాయణమ్మ కాలేజీ, అమీర్‌పేట నేచర్‌ క్యూర్‌ హాస్పిటల్స్ వద్ద ఈ క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి.

కాగా, ఈ కేంద్రాల్లో ఒక్కో గదిని ఇద్దరికి చొప్పున కేటాయించారని, బాత్ రూములు పరిశుభ్రంగా లేవని విదేశీ ప్రయాణికులు వాపోతున్నారు. ఇక ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో నిన్న ఒక్కరోజులో 6 ఇంటర్నేషనల్ విమానాలతో పాటు 30 డొమెస్టిక్ సర్వీసులను విమానయాన సంస్థలు రద్దు చేశాయి.

More Telugu News