Karnataka: విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల చేతులపై ఇలా స్టాంపులు!

  • కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి చర్యలు
  • బెంగళూరులోని విమానాశ్రయంలో మరిన్ని చర్యలు
  • ప్రయాణికుల చేతులపై స్టాంపులు వేస్తోన్న సిబ్బంది
  • స్టాంపులో ఎప్పటివరకు క్వారంటైన్‌లో ఉండాలన్న సమాచారం
Karnataka Home quarantine stamping with indelible ink

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఇళ్లలోనే క్వారంటైన్‌లో ఉన్న అనుమానితుల చేతులపై మహారాష్ట్ర అధికారులు స్టాంపులు వేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు కర్ణాటకలోనూ ఇదే పద్ధతిని పాటిస్తున్నారు.

విదేశాల నుంచి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికులకు ఈ స్టాంపులు వేస్తున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు 14 రోజుల పాటు ఇంట్లో క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. వారు ఎప్పటివరకు క్వారంటైన్‌లో ఉండాలి అనే సమాచారం ఈ స్టాంపులో ఉంది.

ఎడమ అరచేతి వెనుక భాగంలో ఈ స్టాంపులు వేస్తున్నారు. 'బెంగళూరును రక్షిస్తున్నందుకు నేను గర్వపడుతున్నాను. ఇంట్లో క్వారంటైన్‌లో ఉంటాను' అని ఆ స్టాంపులపై రాసి ఉంది. ఇలా స్టాంపులు వేయడం వల్ల సాధారణ ప్రజలతో వారు కలవకుండా నిరోధించవచ్చని అధికారులు భావిస్తున్నారు. కరోనా అనుమానితులు చికిత్సా కేంద్రాల నుంచి పారిపోతున్న ఘటనలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.

More Telugu News