కరోనా నేపథ్యంలో తెలంగాణలో '1895' చట్టం అమలులోకి... ఏం జరుగుతుందంటే...!

1895 Act in Telangana
  • ఏ ప్రాంతాన్నైనా అధికారులు తమ అధీనంలోకి తీసుకోవచ్చు
  • దాదాపు నిరవధిక కర్ఫ్యూ విధించినట్టే
  • ప్రజలంతా ఇళ్లకు మాత్రమే పరిమితం కావాల్సిన పరిస్థితి
తెలంగాణలో కఠినమైన '1895' చట్టాన్ని అమలులోకి తెస్తున్నట్టు కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించింది. రోజురోజుకూ కరోనా బాధితుల సంఖ్య ఇండియాలో పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ చట్టం ప్రకారం, ఏ ప్రాంతాన్నైనా అధికారులు తమ అధీనంలోకి తీసుకోవచ్చు. ఒకసారి ఈ చట్టాన్ని ఓ ప్రాంతంలో అమలులోకి తెస్తే, అక్కడ దాదాపుగా నిరవధిక కర్ఫ్యూ విధించినట్టే. తిరిగి అధికారులు చెప్పేంత వరకూ ఆ ప్రాంతంలో ఎవరూ బయట సంచరించడానికి వీలుండదు. అందరూ ఇళ్లకు మాత్రమే పరిమితం కావాల్సి వుంటుంది. కరోనా వ్యాధి బాధితులు అధికంగా ఉన్న చోట ఈ చట్టాన్ని అమలు చేసే అధికారాలు సంబంధిత ప్రాంత ఆఫీసర్లకు ఉంటుంది.

కాగా, ఫిబ్రవరి 10 తరువాత విదేశాల నుంచి సుమారు 6 వేల మంది వరకూ తెలంగాణకు వచ్చారు. వీరిని ఎటూ వెళ్లకుండా ఆదేశించామని వైద్యాధికారులు స్పష్టం చేసినా, కొందరు బయటకు వెళ్లారని తెలుస్తోంది. వీరి ద్వారానే కరోనా వచ్చే అవకాశాలు ఉండటంతో, వ్యాధి లక్షణాలు కనిపించిన వారిని ఐసోలేషన్ వార్డులకు తరలిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఐసోలేషన్ లో ఉన్న వారిలో సుమారు 12 మంది రిపోర్టులు మాత్రమే రావాల్సి వున్నాయి. మొత్తం 60 మంది వరకూ ప్రస్తుతం క్వారంటైన్ స్థితిలో ఉన్నారు. వారిలో చాలా మంది రక్త నమూనాలను పరీక్షించిన అధికారులు, కరోనా నెగటివ్ గా తేల్చారు. కేవలం ఇద్దరికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. వారికి చికిత్సలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
Go Back to Shorts
Telangana
Corona Virus
1895 Act

More Telugu News