Maruti Rao: విచారణలో కీలక విషయాలు వెల్లడించిన మారుతీరావు డ్రైవర్!

  • దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు
  • డ్రైవర్ కాల్‌డేటాను సేకరించే పనిలో పోలీసులు
  • మరోమారు విచారించే అవకాశం
Saifabad police questions Maruti Rao driver

మారుతీరావు ఆత్మహత్య కేసులో ఆయన కారు డ్రైవర్ రాజేశ్‌ను సైఫాబాద్ పోలీసులు ప్రశ్నించారు. ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావు శనివారం రాత్రి ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య  భవన్‌లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు మారుతీరావు డ్రైవర్‌ను ప్రశ్నించారు.

ఈ సందర్భంగా డ్రైవర్ పలు కీలక విషయాలను వెల్లడించినట్టు తెలుస్తోంది. మిర్యాలగూడ నుంచి బయల్దేరిన తర్వాత మార్గమధ్యంలో ఉన్న ఓ పెస్టిసైడ్స్ షాపు వద్ద మారుతీరావు ఆగాడని అయితే, దుకాణంలోకి వెళ్లకుండానే వెనక్కి వచ్చాడని రాజేశ్ వివరించాడు. మారుతీరావుకు ఆ షాపు యజమాని పరిచయమేనని, తరచూ అక్కడికి వెళ్లి కూర్చునేవారని పోలీసులకు తెలిపాడు.

ఆర్యవైశ్య భవన్‌కు చేరుకున్నాక ఇద్దరం కలిసి బయటకు వెళ్లి టిఫిన్ చేశామని తెలిపాడు. ఆర్యవైశ్య భవన్‌కు చేరుకున్నాక తనను బయటకు పంపి ఆయనకు ఇష్టమైన గారెలు తెప్పించుకుని తిన్నాడని వివరించాడు. అనంతరం తాను కూడా అదే గదిలో నిద్రపోతానని చెప్పినా ఒప్పుకోలేదని, కిందికి వెళ్లి కారులో  పడుకోమని చెప్పడంతో వెళ్లిపోయానని పోలీసులకు తెలిపాడు. కాగా, ఇప్పటికే మారుతీరావు కాల్‌డేటాను సంపాదించిన పోలీసులు, రాజేశ్ కాల్‌డేటాను కూడా పరిశీలించాలని నిర్ణయించారు. అలాగే, మరోమారు అతడిని విచారించనున్నట్టు తెలుస్తోంది.

More Telugu News