Srikalahasti: శ్రీకాళహస్తి ‘జనసేన’ ఇన్​ ఛార్జి కారుపై దాడి.. వైసీపీపై ఆరోపణలు!

  • ఈ ఘటనలో వినూత కారు అద్దాలు ధ్వంసం
  • ‘జనసేన’ కార్యకర్తలపై కర్రలతో దాడి
  • ఇద్దరిపై రాడ్లతో దాడి చేశారని వినూత ఆరోపణ

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ ఛార్జి వినూత కారుపై దుండగులు దాడి చేశారు. తమ అభ్యర్థి నామినేషన్ పరిశీలన నిమిత్తం కారులో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దుండగులను అడ్డుకున్న ‘జనసేన’ కార్యకర్తలపై కర్రలతో దాడికి దిగారు. ఈ దాడిలో వినూత కారు అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటన గురించి ఆమె మాట్లాడుతూ, తమ నాయకులు ఇద్దరిపై రాడ్లతో దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దాడి సమయంలో పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని ఆరోపించారు. నామినేషన్ పరిశీలన కోసం వెళ్లిన తనను కార్యాలయంలోకి వెళ్లనీయలేదని, ‘జనసేన’ ఇన్ ఛార్జిని అని చెప్పినా కూడా పోలీసులు పట్టించుకోలేదని విమర్శించారు. అదే, వైసీపీకి చెందిన వాళ్లు యాభై మంది అక్కడ ఉన్నారని, వారిని మాత్రం అనుమతించారని, వైసీపీకి పోలీసులు ‘సర్వెంట్స్’లా ప్రవర్తిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.

More Telugu News