Rajamouli: కన్నీళ్లు పెట్టించే సీరియళ్లు రాజ్యమేలుతున్న కాలంలో పన్నీటి హాస్యపు జల్లులా కురిసింది: రాజమౌళి

  • అప్పట్లో అందరినీ అలరించిన అమృతం సీరియల్
  • కామెడీ సీరియల్ గా తెలుగు ప్రేక్షకుల విశేషాదరణ
  • ఇప్పుడు అమృతానికి సీక్వెల్ వస్తోందంటూ రాజమౌళి ట్వీట్
Rajamouli tells Amrutham Dwitheeyam hits on Ugadi

ప్రస్తుతం ఏ ఎంటర్టయిన్ మెంట్ చానల్ చూసినా సీరియళ్లదే రాజ్యం. వాటిలో అత్యధిక శాతం బరువైన భావోద్వేగాలను టన్నుల కొద్దీ కుమ్మరిస్తూ, ప్రేక్షకులతోనూ కంటతడి పెట్టించేలా సాగుతుంటాయి. అయితే, ఎన్ని సీరియళ్లు ఉన్నా కొన్నేళ్ల కిందట వచ్చిన పక్కా కామెడీ సీరియల్ 'అమృతం' స్థానం ఇప్పటికీ పదిలం. వెగటు పుట్టించని హాస్యంతో, కడుపుబ్బా నవ్వించే ఆ సీరియల్ కు ఇప్పుడు సీక్వెల్ వస్తోంది. 'అమృతం ద్వితీయం' (అమృతం-2) పేరుతో వస్తున్న ఈ కామెడీ సీరియల్ పై టాలీవుడ్ అగ్రదర్శకుడు రాజమౌళి తనదైన శైలిలో స్పందించారు.

"19 ఏళ్ల కిందట కంటతడి పెట్టించే టీవీ సీరియళ్లు రాజ్యమేలుతున్న కాలంలో, ఇలా కూడా సీరియల్ ఉండొచ్చు అంటూ ఎంతో ధైర్యంతో రంగంలోకి దిగిన ఒకే ఒక్కడు 'అమృతం'. టీవీ సీరియల్ అంటే ఇలాగే ఉండాలన్న రూల్సును తుంగలో తొక్కి ఆ ఒక్కడు సాగించిన కామెడీ షో 'అమృతం'. ఐదు సార్లు రిపీటైన ఒకే ఒక్క సీరియల్, 270 మిలియన్ వ్యూస్ సంపాదించిన ఒకే ఒక్క సీరియల్, చివరి కొన్ని నెలల్లోనే నెలకు 6 మిలియన్ల వ్యూస్ అందుకున్న ఒకే ఒక్క సీరియల్ 'అమృతం' మాత్రమే.

పాత్రల పరంగా చూస్తే ఎప్పటికీ విజయం సాధించని జీరోల్లాంటి అంజి, అమృతం పాత్రల నుంచి ఎంతటి విజయవంతమైన సీరియల్ నిర్మించారో కదా! ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన 'అమృతం' సీరియల్ కు సీక్వెల్ తీసుకురావాలని ఎప్పటినుంచో అభ్యర్థనలు వస్తున్నాయి. ఇప్పుడా అభిమానుల కోరిక తీరుతోంది. ఎట్టకేలకు ఈ ఉగాది నుంచి 'అమృతం ద్వితీయం' వచ్చేస్తోంది" అంటూ రాజమౌళి వరుస ట్వీట్లు చేశారు.

More Telugu News