Guntur: చికెన్ పెట్టి ప్రేమలో పడేశాడు.. ఇప్పుడు పొమ్మంటున్నాడు.. గుంటూరు 'స్పందన'లో వాపోయిన యువతి!

  • చేబ్రోలు సమీపంలో ఘటన
  • పక్కపక్కనే తోపుడు బండ్లపై వ్యాపారం
  • రహస్యంగా గుడిలో తాళి, ఆపై కాపురం
  • గర్భవతి కాగానే వదిలేసి వెళ్లిన యువకుడు
Young Girl Cheated by a Person

తన తోపుడు బండి పక్కనే మరో బండిపై చికెన్ పకోడీ అమ్ముకునే యువకుడు, నిత్యమూ తనకు చికెన్ పెట్టి, ఆపై ప్రేమిస్తున్నానని చెబితే, నమ్మి మోసపోయానని వాపోతూ, ఓ యువతి గుంటూరులో జరిగిన స్పందన కార్యక్రమానికి వచ్చి ఫిర్యాదు చేసింది. మరిన్ని వివరాల్లోకి వెళితే...

చేబ్రోలు మండలానికి చెందిన ఓ యువతి 7వ తరగతి వరకూ చదువుకుంది. ఆమె తండ్రి వికలాంగుడు. కుటుంబ పోషణార్థం, ఆడవారి అలంకరణ వస్తువులను తోపుడు బండిపై పెట్టుకుని అమ్ముతూ ఉంటుంది. ఆమె బండి పక్కనే అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు చికెన్ పకోడీ వ్యాపారం చేస్తుండేవాడు. పక్కనే ఉంటూ స్నేహంగా మెలగడంతో, ఆమె కూడా తరచూ మాట్లాడేది.

ఈ క్రమంలో నిత్యమూ పకోడీలు పెట్టిన అతను, ప్రేమిస్తున్నానని చెప్పాడు. పెళ్లాడతానని మభ్య పెట్టాడు. నువ్వు లేకపోతే చనిపోతానంటూ చెప్పడంతో, ఆమె కూడా ప్రేమలో పడిపోయింది. ఆమెను పెదకాకానికి తీసుకెళ్లిన అతను, గుడిలో తాళి కట్టి, పెళ్లయి పోయిందంటూ, ఓ గది తీసుకుని కాపురం పెట్టాడు.

ఆపై తనకు అప్పులున్నాయంటూ, బాధితురాలి వద్ద ఉన్న బంగారం, వెండి వస్తువులను తీసుకెళ్లాడు. రెండు నెలల కాపురం తరువాత యువతి గర్భవతి అయింది. ఈ విషయం తెలుసుకున్న అతను ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. తన భర్తను, అతని తల్లే దాచి పెట్టిందని, ఇప్పుడు మరో పెళ్లి చేయాలని చూస్తోందని ఆరోపించిన బాధితురాలు, తనకు న్యాయం చేయాలని కోరింది. దీనిపై స్పందించిన అధికారులు, విచారణ జరిపించాలని స్థానిక పోలీసులను ఆదేశించారు.

More Telugu News