Narendra Modi: మోదీ చివరి ట్వీట్... సెకనుకో కామెంట్, గంటకు 26 వేల రీట్వీట్స్!

  • సోషల్ మీడియాను వదిలేస్తానని మోదీ ట్వీట్
  • వైరల్ అయిన 'నో సార్' హ్యాష్ ట్యాగ్
  • తామూ వదిలేస్తామంటున్న నెటిజన్లు
Modi Tweet Goes Viral

ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా ఖాతాల్లో కోట్ల మంది ఫాలోవర్లను కలిగివున్న ప్రధాని నరేంద్ర మోదీ, తాను ఈ ఖాతాల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నానని నిన్న చేసిన ట్వీట్ వైరల్ అయింది. ప్రధాని చేసిన ట్వీట్ గంట వ్యవధిలోనే 26 వేలసార్లకు పైగా రీ ట్వీట్ అయింది. క్షణానికో కామెంట్ వచ్చింది.

మోదీ నుంచి నిరంతర అప్ డేట్స్ కొనసాగాలని, ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని అత్యధికులు కోరడం గమనార్హం. 'నో సార్' అని కొన్ని వేల కామెంట్లు వచ్చాయి. "కావాలంటే చిన్న బ్రేక్ తీసుకోండిగానీ, పూర్తిగా వదిలేయవద్దు" అని కూడా కామెంట్లు వచ్చాయి. మరికొందరు ఇంకో అడుగు ముందుకు వేసి, మోదీ వదిలేస్తే తామూ సోషల్ మీడియాను వదిలేస్తామని స్పష్టం చేశారు. ఇక 'నో సార్' హ్యాష్ ట్యాగ్ వైరల్ అయింది.

కాగా, సామాజిక మాధ్యమాల్లో నరేంద్ర మోదీ చాలా చురుకుగా ఉంటారన్న సంగతి తెలిసిందే. ట్విట్టర్ లో 5.33 కోట్లమంది, ఫేస్‌ బుక్‌ లో 4.4 కోట్ల మంది, ఇన్‌ స్ట్రాగామ్‌ లో 3.52 కోట్ల మంది ఆయనను ఫాలో అవుతున్నారు. ప్రపంచంలోనే అత్యధిక ట్విట్టర్ ఫాలోవర్లను కలిగివున్న టాప్ - 3 నేత, ఫేస్ బుక్ లో టాప్-2 నేత మోదీయే. అమెరికా అధ్యక్షుడు టొనాల్డ్ ట్రంప్‌ సైతం ఇటీవల ఈ విషయాన్ని ప్రస్తావించారు.

More Telugu News