Atchannaidu: వైసీపీ భూకబ్జాల గుట్టురట్టవుతుందనే భయంతోనే ఈ పనులు చేయించారు: అచ్చెన్నాయుడు ఆగ్రహం

  • నిన్న విశాఖలో బాబును అడ్డుకున్న ఘటనపై ఫైర్
  • పులివెందుల రౌడీలు, వైసీపీ కార్యకర్తలతోనే ఈ దాడి చేయించారు
  •  పది మంది వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోలేకపోయారు!
Atchannaidu fires on ysrcp

నిన్న విశాఖలో చంద్రబాబునాయుడుని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్న ఘటనపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. విశాఖలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ భూ కబ్జాల గుట్టు రట్టవుతుందనే భయంతోనే ఈ పనులు చేస్తున్నారని ఆరోపించారు. పులివెందుల రౌడీలు, వైసీపీ కార్యకర్తలతో దాడి చేయించారని ధ్వజమెత్తారు. కోడిగుడ్లు, టమోటాలను ముందుగానే సిద్ధం చేసుకుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? మూడు వందలకు పైగా ఉన్న పోలీసులు పది మంది వైసీపీ కార్యకర్తలను అడ్డుకోకపోవడం దేనికి సంకేతం? అని ప్రశ్నించారు. పక్కా ప్రణాళికతోనే చంద్రబాబుపై ఈ దాడికి పాల్పడ్డారని, తగిన సమయంలో వైసీపీకి ప్రజలు బుద్ధిచెబుతారని అన్నారు.

విశాఖలో భూ అక్రమాలను ప్రజల ముందు ఉంచే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. విశాఖ భూ కబ్జాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. విశాఖకు వచ్చే పెట్టుబడులను ఈ ప్రభుత్వం తరిమేసిందని  విమర్శించారు. ప్రశాంతతను కోరుకునే విశాఖ ప్రజలు వైసీపీ అరాచకాలను చూసి అసహ్యించుకుంటున్నారని, ఇక్కడికి వచ్చే పెట్టుబడులను తరిమేస్తున్న వైసీపీ నేతలు అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు.

More Telugu News