Melania Trump: మెలానియాలో అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా... భారత్ మహిమేనా!

  • గతంలో ట్రంప్ తో అంటీముట్టనట్టుగా ఉండే మెలానియా!
  • భారత పర్యటనలో కలివిడిగా మసలుకుంటూ ఆశ్చర్యానికి గురిచేస్తున్న వైనం
  • ఉల్లాసంగా గడుపుతున్న అమెరికా ప్రథమ మహిళ
Melania Trump enjoys her India trip

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాటు ఆయన భార్య మెలానియా కూడా భారత్ లో పర్యటిస్తున్నారు. అమెరికా ప్రథమ మహిళ హోదాలో ఆమె భారత గడ్డపై రాచమర్యాదలు అందుకుంటున్నారు. మెలానియా మునుపెన్నడూ లేనంత సంతోషంగా కనిపిస్తుండడం అంతర్జాతీయ మీడియాను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. అందుకు కారణం ఉంది.

 ట్రంప్ అనేక దేశాల్లో పర్యటించినప్పుడు ఆయన మెలానియాను కూడా తీసుకువెళ్లేవారు. కానీ మెలానియా సాధ్యమైనంతవరకు ట్రంప్ తో అంటీముట్టనట్టుగానే వ్యవహరించేవారని కథనాలు వచ్చాయి. అందుకు ఆధారంగా వీడియో ఫుటేజ్ కూడా ఉంది. వీరిద్దరి మధ్య సఖ్యత లేదని, వైట్ హౌస్ లోనూ వీరు ఎడమొహం పెడమొహంగా ఉంటారని ప్రచారం జరిగింది. విదేశీ పర్యటనల్లో మెలానియా ముఖంపై పెద్దగా చిరునవ్వు కనిపించేది కాదు.

కానీ, భారత్ పర్యటనకు వచ్చింది మొదలు మెలానియాలో తుళ్లిపడే సంతోషం కనిపిస్తోంది. ట్రంప్ తోనూ సన్నిహితంగా మసలుకుంటున్నారు. సబర్మతి ఆశ్రమ సందర్శన మొదలు, నమస్తే ట్రంప్, తాజ్ మహల్ సందర్శనలో ఆ విషయం స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా ప్రేమకు చిహ్నంలా భాసిల్లే తాజ్ మహల్ వద్ద ట్రంప్, మెలానియాల బాడీ లాంగ్వేజి గమనిస్తే వారిలో ప్రేమభావనలు పురివిప్పిన అనుభూతి కలుగుతుంది. చేతిలో చేయి వేసుకుని నడిచిన తీరులో ఎక్కడా నాటకీయత కనిపించదు.

తాజాగా, ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాల చిన్నారులతో మెలానియా గడిపిన తీరు ఆమె ఆనందోత్సాహాలకు పరాకాష్ఠ అని చెప్పాలి. చిన్నారుల్లో చిన్నారిలా మారి ఎంతో ఉల్లాసంగా గడిపారు. మొత్తమ్మీద భారత పర్యటనను ఆమె ఎంతో ఆస్వాదిస్తున్నట్టు అర్థమవుతోంది.

More Telugu News