Khushbu: ఇద్దరూ గోడలు కట్టినవాళ్లే... భలే జోడీ!: ట్రంప్, మోదీలపై ఖుష్బూ వ్యాఖ్యలు

  • భారత్ లో కొనసాగుతున్న ట్రంప్ పర్యటన
  • ఓ వర్గం ప్రజలను వేరు చేసేందుకు ట్రంప్ గోడకట్టారన్న ఖుష్బూ
  • మోదీ తన వైఫల్యాలు కనిపించకుండా గోడకట్టారని ఎద్దేవా
Khushbu comments on Trump and India

భారత్ లో ఎక్కడ చూసినా డొనాల్డ్ ట్రంప్ మేనియా కనిపిస్తోంది. ఈ మధ్యాహ్నం ట్రంప్ భారత్ వచ్చిన దగ్గర్నుంచి మీడియాలో అత్యధిక భాగం ఆయన కథనాలే దర్శనమిస్తున్నాయి. సోషల్ మీడియాలో అమెరికా అధ్యక్షుడికి సంబంధించిన వార్తలే ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో, సినీ నటి, కాంగ్రెస్ నేత ఖుష్బూ స్పందించారు. ట్రంప్, మోదీలను ఉద్దేశించి ఆహా ఏం జోడీ! అంటూ ట్వీట్ చేశారు.

నిజమైన నాయకుడికి, గాలివాటుగా గెలిచిన నాయకుడికి తేడా ఇదీ అంటూ వివరణ ఇచ్చారు. ఓ వర్గం ప్రజలను వేరు చేసేందుకు గోడ కట్టారని ట్రంప్ ను ఉద్దేశించి పేర్కొన్నారు. ట్రంప్ పదవిలోకి వచ్చిన తర్వాత మెక్సికో నుంచి అక్రమ చొరబాట్లను అడ్డుకునేందుకు భారీ గోడ నిర్మాణానికి నడుంబిగించడం తెలిసిందే. ఇక మోదీ గురించి ప్రస్తావిస్తూ, తన వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు ఈయన కూడా ఓ గోడ కట్టారని ఎద్దేవా చేశారు. ట్రంప్ రాక నేపథ్యంలో మొతేరా మురికివాడలు ఆయనకు కనిపించకుండా అడ్డంగా గోడలు నిర్మించిన సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఖుష్బూ ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఖుష్బూ జోడీ నెంబర్ వన్ అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు, ట్రంప్, మోదీ ఇద్దరినీ ఒకే గాటన కట్టేస్తూ జాత్యహంకారులుగా పేర్కొన్నారు.

More Telugu News