Sujana Chowdary: సుజనా ఆస్తులను వేలానికి ఉంచిన బ్యాంక్ ఆఫ్ ఇండియా!

  • బ్యాంకుకు రూ. 400 కోట్ల బకాయిలు
  • ఆన్ లైన్ విధానంలో ఆస్తుల వేలం
  • ప్రకటించిన బ్యాంకు చెన్నై శాఖ
Sujana Assesta Auction

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తూ, తమ బ్యాంకు నుంచి భారీ ఎత్తున రుణాన్ని తీసుకుని, తిరిగి చెల్లించడంలో విఫలమైన సుజనా యూనివర్సల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ఆస్తులను, ఆన్ లైన్ ద్వారా వేలం వేయనున్నామని ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీవోఐ) ఓ ప్రకటనలో తెలిపింది. బ్యాంకుకు చెందిన చెన్నై లార్జ్‌ కార్పొరేట్‌ శాఖ నుంచి ఈ మేరకు ఓ ప్రకటన విడుదలైంది. సుజనా యూనివర్సల్‌ నుంచి బ్యాంకుకు రూ. 400 కోట్ల బకాయిలు రావాల్సి వుందని, వాటిని రికవరీ చేసుకునేందుకు సర్ఫేసీ చట్టం కింద ఆస్తులను వేలానికి ఉంచామని బ్యాంకు తెలిపింది.

2018 అక్టోబరు నాటికి సంస్థ నుంచి తమ బ్యాంకుకు రూ. 322 కోట్లు రావాల్సివుందని, ప్రస్తుతం అది వడ్డీలు కలుపుకుంటే రూ. 400 కోట్లకు చేరిందని పేర్కొంది. కాగా, సుజనా యూనివర్సల్‌ తీసుకున్న రుణాలకు యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి), వై జితిన్‌ కుమార్‌, వై శివరామకృష్ణ, ఎస్‌టీ ప్రసాద్‌, జీ శ్రీనివాస రాజు, సార్క్‌ నెట్‌ లిమిటెడ్‌, సుజనా క్యాపిటల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌, సుజనా పంప్స్‌ అండ్‌ మోటార్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, మెస్సర్స్‌ స్ల్పెండిడ్‌ మెటల్‌ ప్రొడక్ట్స్‌, నియోన్‌ టవర్స్‌ లిమిటెడ్‌,  గ్యారంటీర్లుగా వ్యవహరించారు.

More Telugu News