Chandrababu: ఆంబోతులకు భయం ఉండదు, దున్నపోతులకు చలనం ఉండదు: చంద్రబాబు

  • ప్రకాశం జిల్లాలో చంద్రబాబు ప్రజాచైతన్య యాత్ర
  • మార్టూరులో చంద్రబాబు ప్రసంగం
  • వైసీపీ ప్రభుత్వంపై విమర్శల జడివాన
  • 'ఒక్క చాన్స్' పర్యవసానాలే ఈ బాధలు అంటూ వ్యాఖ్యలు
Chandrababu fires on YSRCP leaders at Martur rally

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. మార్టూరులో ఆయన ప్రజాచైతన్య యాత్రలో భాగంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, ఒక్క చాన్స్ అంటే ఓటేశారని, దాని పర్యవసానం ఇప్పుడు అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు. 9 నెలల వైసీపీ పాలనలో ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉందో చూడండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల భవిష్యత్తును నాశనం చేయాలని చూస్తున్నారని విమర్శించారు.

"ఎన్నికల సమయంలో ఒక మాయ మిమ్మల్ని ఆకట్టుకుంది. వివిధ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో 34 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మద్దతు ధరల్లేవు, పేదలకు కడుపు నిండా తిండిపెట్టే అన్న క్యాంటీన్లు మూతపడ్డాయి. ప్రజల కోసం పోరాడితే ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు. మేం అధికారంలో ఉన్నప్పుడు ఇలా వ్యవహరించి ఉంటే వీళ్లు పాదయాత్రలు చేసేవాళ్లా? ఈ ఆంబోతులకు భయం ఉండదు, ఈ దున్నపోతులకు చలనం ఉండదు. కానీ ఇలాంటి దున్నపోతుల పొగరు దించే శక్తి ప్రజలకే ఉంది. ప్రజలు సురక్షితంగా ఉండాలంటే రేపు జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో వీళ్లకు కళ్లెం వేయాలి. మాకు సెక్యూరిటీ తగ్గించారు. దోపిడీ చేసుకోవడానికి వైసీపీ దొంగలకు భద్రత పెంచారు. నాకేం భయంలేదు. నా భద్రతను ప్రజలే చూసుకుంటారు. అమరావతిని శ్మశానం, ఎడారి అంటున్నారు. ఈ పిచ్చి తుగ్లక్ నన్ను విమర్శిస్తాడా?" అంటూ ధ్వజమెత్తారు.

More Telugu News