women: అలా వంట చేసే మహిళలు కుక్కలుగా.. అది తిన్నవారు ఎద్దులుగా పుడతారట: స్వామి కృష్ణస్వరూప్ వివాదాస్పద వ్యాఖ్యలు

  • వెలుగులోకి స్వామి కృష్ణస్వరూప్ వీడియో
  • నెలసరి సమయంలో మహిళలు వంట చేస్తే విపరీతాలంటూ వ్యాఖ్య
  • పురుషులు వంట నేర్చుకోవాలని సూచన
Swami krushnaswarup controversial comments on women

మన శాస్త్రాల్లో ఉన్నదే చెబుతున్నానంటూ స్వామి కృష్ణస్వరూప్ దాస్‌జీ చెప్పిన మాటలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. గుజరాత్‌లోని భుజ్‌లో ఆయన ఆధ్వర్యంలో స్వామినారాయణ్ మందిరం ఉంది. ఈ మందిరం సభ్యులు సహజానంద గాళ్స్ ఇనిస్టిట్యూట్ నిర్వహిస్తున్నారు. అమ్మాయిలు నెలసరి సమయంలో వంటగదిలోకి వచ్చి ఇతరులతో కలిసి భోజనం చేయకూడదన్న నిబంధన ఇక్కడ ఉంది. ఇటీవల ఈ నిబంధన ఉల్లంఘించారన్న కారణంతో 68 మంది విద్యార్థినుల లోదుస్తులు విప్పించి మరీ పరిశీలించిన విషయం వెలుగులోకి రావడం తీవ్ర సంచలనమైంది. ఈ కేసులో ప్రిన్సిపాల్‌తోపాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ కేసు నడుస్తుండగానే తాజాగా గుజరాత్‌లో కృష్ణస్వరూప్ దాస్‌జీ వీడియో క్లిప్ ఒకటి వెలుగులోకి వచ్చి వైరల్ అవుతోంది. అందులో ఆయన మాట్లాడుతూ.. తన అభిప్రాయాలు నచ్చినా, నచ్చకపోయినా తాను పట్టించుకోబోనన్న ఆయన పురుషులు వంట నేర్చుకోవాలని సూచించారు. ఎందుకంటే.. నెలసరి సమయంలో భర్తలకు వంట చేసి పెట్టే భార్యలు మరుజన్మలో ఆడకుక్కలుగా, ఆ వంట తిన్న పురుషులు వచ్చే జన్మలో ఎద్దులుగా పుడతారని సెలవిచ్చారు.

ఇది తాను చెబుతున్న విషయం కాదని, శాస్త్రాల్లో ఉన్నదే తాను చెప్పానని పేర్కొన్నారు. ఈ విషయాలన్నీ చెప్పడం తనకు ఇష్టం లేదంటూనే, మిమ్మల్ని హెచ్చరించాలనే ఉద్దేశంతో చెప్పినట్టు వివరించారు. అయితే, ఈ వీడియో కచ్చితంగా ఎప్పటిదన్న విషయాలు తెలియకపోయినా, ఇలాంటి వీడియోలు ఆలయ యూట్యూబ్ చానల్‌లో చాలానే ఉన్నాయి.

More Telugu News