ఆర్మీ కమాండ్ పోస్టులకు మహిళలు అర్హులే: తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు
- వారి సామార్థ్యాలపై అనుమానాలు వద్దు
- మహిళల పనితీరుపై విశ్వాసం ఉంచండి
- శారీరక లక్షణాలతో హక్కుల్ని ముడిపెట్టవద్దు
కమాండ్ పోస్టుకు మహిళా అధికారులను నిరాకరించడం అంటే రాజ్యాంగం వారికి కల్పిస్తున్న సమాన హక్కులకు వ్యతిరేకమని, ఇది పూర్తి నిర్హేతుక చర్యని ధర్మాసనం వ్యాఖ్యానించింది. శారీరక పరిమితులు, సామాజిక నిబంధనల కారణంగా మహిళలకు అవకాశం కల్పించడం లేదన్న కేంద్రం వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది.
‘మహిళలు ఇంటి పనులకు మాత్రమే పరిమితం అన్న ధోరణి మారాలి. వారి శారీరక లక్షణాలకు, హక్కులకు ఎటువంటి సంబంధం లేదు. ఇలా చెప్పడం ఆందోళనకరం. దీన్ని మేము ఎప్పటికీ అంగీకరించం’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఆర్మీలోని మహిళా అధికారులు అందరికీ సర్వీస్తో సంబంధం లేకుండా మూడు నెలల్లోగా శాశ్వత కమిషన్ కల్పించాలని ఆదేశించింది.