Team India: కివీస్ తో టెస్టు సిరీస్ కు ముందు టీమిండియాకు సరైన ప్రాక్టీస్!

  • న్యూజిలాండ్ లో పర్యటిస్తున్న టీమిండియా
  • మరికొన్నిరోజుల్లో టెస్టు సిరీస్ ఆరంభం
  • మూడ్రోజుల ప్రాక్టీసులో అమోఘంగా రాణించిన భారత ఆటగాళ్లు
  • న్యూజిలాండ్ ఎలెవెన్ తో డ్రాగా ముగిసిన మ్యాచ్
Team India draws practice match against New Zealand XI

న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా రెండు టెస్టుల సిరీస్ కు సన్నద్ధమవుతోంది. ఫిబ్రవరి 21 నుంచి కివీస్ తో టెస్టు సిరీస్ జరగనుంది. టీ20 సిరీస్ ను వైట్ వాష్ చేసిన భారత్, ఆపై వన్డేల్లో బొక్కబోర్లాపడింది. అయితే టెస్టుల్లో ఇటీవల బలమైన జట్టుగా ఎదిగిన టీమిండియా సొంతగడ్డపై ఆడుతున్న కివీస్ ఓడించేందుకు తహతహలాడుతోంది. అందుకు తగ్గట్టే మూడ్రోజుల ప్రాక్టీసు మ్యాచ్ లో అన్ని వనరులను సమర్ధంగా ప్రయోగించి చూసింది. హామిల్టన్ లో భారత్, న్యూజిలాండ్ ఎలెవెన్ జట్ల మధ్య జరిగిన మూడ్రోజుల ప్రాక్టీసు మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ లో భారత్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది.

తొలి ఇన్నింగ్స్ లో 263 పరుగులకు ఆలౌటైన టీమిండియా, ప్రత్యర్థిని 235 పరుగులకే కట్టడి చేసింది. టీమిండియా పేసర్లు బుమ్రా, ఉమేశ్ యాదవ్, షమీ, సైనీ విశేషంగా రాణించి ప్రత్యర్థి జట్టు పతనంలో పాలుపంచుకున్నారు. షమీ మూడు వికెట్లు తీయగా, బుమ్రా, ఉమేశ్, సైనీ తలో రెండేసి వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ పరుగుల మోత మోగించింది. పృథ్వీ షా 39, మయాంక్ అగర్వాల్ 81, రిషబ్ పంత్ 70, సాహా 30 పరుగులతో రాణించారు. ఆట చివరికి భారత్ తన రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లకు 252 పరుగులు చేయడంతో మ్యాచ్ డ్రా దిశగా మళ్లింది.

More Telugu News