యూపీలో పైశాచికం... పోలీసుల గ్యాంగ్ రేప్!
- గోరఖ్ పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన
- వ్యభిచారం చేస్తున్నావంటూ యువతి నిర్బంధం
- గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు
- జ్యుడీషియల్ ఎంక్వయిరీకి విపక్షాల డిమాండ్
ఈ ఘటనపై పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, అత్యాచారానికి పాల్పడిన పోలీసులు ఎవరో తనకు తెలియదని బాధితురాలు చెప్పడంతో, గుర్తు తెలియని వ్యక్తులపై కేసు పెట్టారు. ఈ కేసులో ఇంతవరకూ ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని, నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని గోరఖ్ పూర్ ఎస్ఎస్పీ సునీల్ కుమార్ గుప్తా వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలో బాధితురాలు చికిత్స పొందుతోందని, ఇద్దరు పోలీసులు రేప్ చేశారని చెబుతోందని, విచారణలో భాగంగా తాము సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఆ యువతి తనంతట తానుగానే మరొకరితో హోటల్ కు వెళ్లినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని, ఏదిఏమైనా నేరానికి పాల్పడిన పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన అన్నారు.
తాను వ్యభిచారం చేసేందుకు హోటల్ కు వచ్చానని ఆరోపించిన ఇద్దరు పోలీసులు తనను కొట్టారని, ఆపై బలవంతం చేశారని, తనను వదిలి పెట్టాలని వేడుకున్నా వినలేదని బాధితురాలు మీడియా ముందు వాపోయింది. తనపై అత్యాచారం చేసిన హోటల్ గదిని తాను గుర్తిస్తానని చెప్పింది. తాను ఇంటివద్దనే ట్యూషన్లు చెప్పుకుంటూ ఉపాధిని పొందుతున్నానని, తన తండ్రి రోజుకూలీ అని వెల్లడించింది.
ఈ ఘటనపై మీడియాలో వార్తలు రాగానే, కాంగ్రెస్, సమాజ్ వాదీ, పూర్వాంచల్ సేన తదితర పార్టీల నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. గోరఖ్ పూర్ పోలీసు స్టేషన్ లోని అందరు పోలీసులనూ సస్పెండ్ చేయాలని, ఘటనపై జ్యుడీషియల్ ఎంక్వయిరీ జరిపించాలని డిమాండ్ చేశారు.