Karimnagar District: ప్రేమోన్మాదమా?... దొంగతనం కోసం వచ్చి దారుణమా?... రాధిక కేసును సీరియస్ గా తీసుకున్న కరీంనగర్ పోలీసులు!

  • కరీంనగర్ లో ఘటన
  • గతంలో అద్దెకున్న యువకుడిపై అనుమానం
  • ఇంట్లో దొంగతనం జరగడంతో దొంగలపైనా అనుమానం
Brutal Murder in Karimnagar District

కరీంనగర్ లో కలకలం రేపిన ఇంటర్ బాలిక ముత్త రాధిక (18) హత్యోదంతం కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. తల్లిదండ్రులు కూలీ పనికి వెళ్లిన సమయంలో రాధిక ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. నిన్న సాయంత్రం సమీపంలోని బాలుడు ఆమె ఇంటికి వచ్చి చూసేసరికి రక్తపు మడుగులో కనిపించింది. ఆమెను ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు పోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, హంతకులను గుర్తించేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

కాగా, గతంలో రాధికకు ఉన్న ప్రేమ వ్యవహారం ఈ హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో వీరి ఇంట్లో ఓ యువకుడు అద్దెకున్నాడు. ఇదే సమయంలో రాధిక ఇంట్లోని సెల్ ఫోన్ కు ఒకే నంబర్ నుంచి చాలా కాల్స్ వచ్చినట్టు గుర్తించారు. ఆ ఇంటికి చుట్టుపక్కల ఉన్న అన్ని సీసీ కెమెరాలనూ పోలీసులు పరిశీలిస్తున్నారు.

ఇక తమ ఇంట్లోని 4 తులాల బంగారం, కొంత డబ్బు చోరీకి గురైందని రాధిక తల్లిదండ్రులు చెబుతుండటంతో, ఎవరైనా దొంగతనానికి వచ్చి, అడ్డుకున్న రాధికను హత్య చేసి వెళ్లారా? అన్న కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. హత్య జరిగిన స్థలానికి డాగ్ స్క్వాడ్ ను తీసుకురాగా, సమీపంలో ఉన్న వాటర్ ట్యాంక్ వరకూ వెళ్లిన జాగిలం, అక్కడ ఆగిపోయింది. దీంతో నిందితుడు, అక్కడి నుంచి వాహనంలో వెళ్లి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

More Telugu News