Chandrababu: ఏపీలో విద్యుత్ చార్జీలు పెంచడంపై చంద్రబాబు ఆగ్రహం

  • పరిపాలన చేతకాక వ్యవస్థలన్నింటినీ దిగజార్చారు
  • రాష్ట్రాన్ని ఆర్థికంగా కుదేలు చేసింది
  •  ఆ భారాన్ని ప్రజలపై వేయడం ఎంత దుర్మార్గం?
chandrababu fires on hiking power charges in AP

ఏపీలో కరెంట్ ఛార్జీలు పెంచడంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వరుస ట్వీట్లు చేశారు. పరిపాలన చేతకాక వ్యవస్థలన్నింటినీ దిగజార్చి, ఆర్థికంగా కుదేలు చేశారనీ, ఇప్పుడు ఆ భారాన్ని ప్రజలపై వేయడం ఎంత దుర్మార్గం? అని ప్రశ్నించారు. ఆర్టీసీ బస్సు చార్జీలు, పెట్రోలు చార్జీలు, ఫైబర్ గ్రిడ్ చార్జీలను ఇప్పటికే పెంచిన ప్రభుత్వం, ఇప్పుడు విద్యుత్ చార్జీలు కూడా పెంచిందని మండిపడ్డారు.
 
విద్యుత్ ఒప్పందాల రద్దు దేనికి? అని ప్రశ్నిస్తే ప్రజల మీద కరెంటు చార్జీల భారం తగ్గించడానికి అని చెప్పిన వాళ్లు, ఇప్పుడు ఎందుకు పెంచారు? అని ప్రశ్నించారు. ఇప్పటికే పరిశ్రమలకు రాయితీలను ఇవ్వడం ఆపేశారని, ఇప్పుడీ కరెంటు చార్జీల భారంతో పరిశ్రమలు ఎలా నిలదొక్కుకుంటాయి? అని ప్రశ్నించారు.

ఇప్పటికే రాష్ట్రం నుంచి అనేక పరిశ్రమలు వెళ్లిపోయాయని, ఇప్పుడీ కరెంట్ చార్జీల భారంతో ఉన్నవాళ్లు కూడా వెళ్లిపోయేలా చేస్తున్నారని విమర్శించారు. నాడు టీడీపీ హయాంలో ‘పెట్టుబడుల గమ్యస్థానం’ అనిపించుకున్న ఏపీ, నేడు వైసీపీ పాలనలో ‘పరిశ్రమల గల్లంతు స్థానం’ అవడం బాధేస్తోందని అన్నారు. భవిష్యత్తులో కరెంట్ చార్జీలు పెంచేది లేదని చెప్పిన మాట నిలబెట్టుకున్నది టీడీపీ అని, చార్జీలు పెంచం అని నమ్మించి మోసం చేసింది వైసీపీ అని విమర్శించారు.  

More Telugu News