Hyderabad: హైదరాబాద్‌లో నేలమట్టం కానున్న వందేళ్ల నాటి ‘స్టోన్ బిల్డింగ్’?

  • సచివాలయానికి వాస్తు దోషం పేరుతో కూల్చివేతకు రెడీ
  • 1910లో నిజాంల కాలంలో పూర్తి రాతితో నిర్మాణం
  • ప్రభుత్వం నిర్ణయంపై విమర్శలు

హైదరాబాద్‌లోని వందేళ్లనాటి చారిత్రక కట్టడం ‘స్టోన్ బిల్డింగ్’ నేలమట్టం కానుంది. సెక్రటేరియట్‌కు వాస్తుదోషం కారణంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నిజాం పాలనలో 1910లో పూర్తిగా రాతితో నిర్మించిన ఈ భవనంలో ప్రస్తుతం టీఎస్ఎస్‌పీడీసీఎల్‌కు సంబంధించిన వివిధ విభాగాల కార్యాలయాలు ఉన్నాయి. సెక్రటేరియట్ అవుట్ గేట్ పక్కనే మింట్ కాంపౌండ్‌లో ఉన్న ఈ భవనం వల్ల సెక్రటేరియట్‌కు వాస్తు దోషం ఉందన్న కారణంతో దీనిని కూల్చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  

రాతి కట్టడమైన ఈ భవనానికి చాలా చరిత్ర ఉంది. దక్షిణాసియాలోనే తొలిసారిగా హైదరాబాద్‌ రాష్ట్రంలో నిర్మించిన తొలి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ ఈ భవనంలోనే ఉండేది. ఉస్మానియా టెక్నికల్‌ కాలేజ్‌ కూడా కొన్నాళ్లపాటు ఈ భవనంలోనే కొనసాగింది. ప్రస్తుతం ఉన్న టీఎస్ఎస్‌పీడీసీఎల్‌ సంబంధిత కార్యాలయాలను వెంటనే ఖాళీ చేయాలంటూ ప్రభుత్వం నుంచి అధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయి. మరోవైపు, నిర్మించి వందేళ్లు అయినా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్న ఈ భవనాన్ని కూల్చడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

More Telugu News