Bengaluru: పూల వ్యాపారి భార్య ఖాతాలో రూ. 30 కోట్లు వచ్చి పడ్డాయ్!

  • కర్ణాటకకు చెందిన వ్యాపారి సయ్యద్ మాలిక్
  • ఆన్ లైన్లో చీర కొనడంతో లాటరీ తగిలిందని ఫోన్
  • ఆదాయపన్ను శాఖకు ఫిర్యాదు

అతను ఓ సాధారణ పూల వ్యాపారి. రెక్కాడితేగాని డొక్కాడని వ్యక్తి. అతని భార్య బ్యాంకు ఖాతాలో ఒక్కసారిగా రూ. 30 కోట్లు వచ్చిపడటంతో, అంత డబ్బు ఎవరు, ఎందుకు వేశారో తెలియక, దాన్ని వాడుకుంటే ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంలో పడిపోయాడు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

రామనగర జిల్లా చెన్నపట్టణకు చెందిన సయ్యద్ మాలిక్ బుర్హాన్ అనే పూల వ్యాపారి భార్య ఖాతాలో ఒకేసారి ఇంత మొత్తంలో డబ్బు వచ్చి పడింది. ఆ విషయాన్ని బ్యాంకు అధికారులు ఇంటికి వచ్చి చెప్పేంతవరకూ అతనికిగానీ, అతని భార్యకు గానీ విషయం తెలియదు. ఇన్ని డబ్బులు మీ ఖాతాలో ఎవరు జమ చేశారని వారు ప్రశ్నించడంతో బుర్హాన్ అవాక్కయ్యాడు.

తాను గతంలో ఓ ఆన్ లైన్ పోర్టల్ ద్వారా చీరను ఆర్డర్ చేశానని, అప్పుడు తాను ఓ కారును గెలుచుకున్నానని చెబుతూ, తన బ్యాంకు ఖాతా వివరాలను ఫోన్ చేసి, అడగడంతో భార్య అకౌంట్ నంబర్ వివరాలు చెప్పానని, ఈ డబ్బు ఎవరు వేశారో తెలియదని అతను అంటున్నాడు.

ఇదిలావుంచితే, ఈ విషయంపై బుర్హాన్ ఆదాయపన్ను శాఖ అధికారులకు ఫిర్యాదు కూడా చేశాడు. దీంతో పోలీసులు మోసం, మరొకరి పేరు మీద లావాదేవీల కేసును నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ అకౌంట్ ద్వారా చాలా లావాదేవీలు జరిగాయనీ, అవన్నీ బుర్హాన్ కు తెలియకపోవచ్చనీ పోలీసధికారి చెప్పారు. ఏమైనా, దీని వెనుక ఎవరున్నారో త్వరలోనే తేలుస్తామని అన్నారు.

More Telugu News