Uttar Pradesh: భార్యను హతమార్చి.. ఆమె తలతో పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన నిందితుడు!

  • హత్యకు కారణమైన చిన్నపాటి ఘర్షణ
  • తల పట్టుకుని పోలీస్ స్టేషన్‌‌కు బయలుదేరిన నిందితుడు
  • పోలీస్ స్టేషన్‌లో జాతీయ గీతం ఆలాపన

దంపతుల మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణ భార్య హత్యకు కారణమైంది. ఆమెను కిరాతకంగా నరికి చంపిన భర్త.. అనంతరం మొండెం నుంచి తలను వేరుచేసి దానిని పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఉత్తరప్రదేశ్‌లోని జహంగిరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. బహదూర్‌పూర్‌కు చెంది అఖిలేశ్ రావత్ భార్యతో కలిసి నివసిస్తున్నాడు.

నిన్న వారి మధ్య ఏదో విషయంలో చిన్నపాటి ఘర్షణ మొదలైంది. దీంతో సహనం కోల్పోయిన అఖిలేశ్ భార్యను దారుణంగా చంపేశాడు. అనంతరం మృతదేహం నుంచి తలను వేరుచేశాడు. దానిని చేతితో పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు బయలుదేరారు. రోడ్డు వెంట తలపట్టుకుని నడుస్తున్న అతడిని చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.

రోడ్డుపై అతడిని గమనించిన పోలీసులు షాకయ్యారు. అతడిని ఆపి తలను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే, వారితో వాగ్వివాదానికి దిగిన నిందితుడు.. తలను వారికి అప్పగించకుండా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. పోలీసులు అక్కడ అతడి నుంచి తలను స్వాధీనం చేసుకున్నారు. ఆ వెంటనే నిందితుడు జాతీయ గీతం ఆలపించడం విశేషం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News