Telangana: అదృష్ట దేవత అలా కరుణించింది... టీఎస్ మునిసిపల్ ఎన్నికల్లో ఒకటి, మూడు ఓట్ల తేడాతో గెలిచింది వీరే!

  • గత వారం మునిసిపల్ ఎన్నికలు
  • నిన్న విడుదలైన ఫలితాలు
  • స్వల్ప మెజారిటీతో నెగ్గిన పలువురు

తెలంగాణలో గత వారం జరిగిన మునిసిపల్ ఎన్నికల ఫలితాలు నిన్న విడుదల కాగా, అధికార తెలంగాణ రాష్ట్రసమితి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు ఒకటి నుంచి మూడు ఓట్ల తేడాతో ప్రత్యర్థులపై విజయం సాధించారు. నారాయణపేట మునిసిపాలిటీ 7వ వార్డు నుంచి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన మహ్మద్ సలీమ్, తన సమీప బీజేపీ అభ్యర్థి చలపతిపై కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో నెగ్గారు. సలీమ్ కు 311 ఓట్ల రాగా, చలపతికి 310 ఓట్లు పడ్డాయి. మెజారిటీ ఒక్క ఓటు మాత్రమే కావడంతో, మరోసారి ఓట్లను లెక్కించిన అధికారులు సలీమ్ విజయాన్ని అధికారికంగా ప్రకటించారు. కేవలం అదృష్టంతోనే తాను ఈ ఎన్నికల్లో విజయం సాధించానని, దొంగఓట్లను తమ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారని ఆయన అన్నారు.

ఇక, వడ్డేపల్లి మునిసిపాలిటీలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎన్ అజయ్ కుమార్ మూడు ఓట్ల తేడాతో విజయం సాధించారు. 7వ వార్డు నుంచి ఆయన బరిలోకి దిగి 361 ఓట్లు తెచ్చుకోగా, సమీప కాంగ్రెస్ అభ్యర్థిని వేదవతికి 358 ఓట్లు వచ్చాయి. దీంతో వేదవతి డిమాండ్ మేరకు రీకౌంటింగ్ చేసిన అధికారులు, అజయ్ కుమార్ మూడు ఓట్ల తేడాతో విజయం సాధించినట్టు ప్రకటించారు. ఇదే విధంగా పలు మునిసిపాలిటీల్లోని వార్డుల్లో స్వల్ప మెజారిటీతోనే పలువురు గట్టునపడి, అదృష్టం కలిసొచ్చిందన్న ఆనందంలో ఉన్నారు. 

More Telugu News