Telugudesam: శాసనమండలి ప్రసారాలను కట్ చేసే హక్కు నీకెవరు ఇచ్చారు?: జగన్ కు చంద్రబాబు సూటి ప్రశ్న

  • మేము కూర్చున్న రూమ్ లోనూ కనెక్షన్స్ కట్ చేసేశారు
  • ప్రజాస్వామ్యంపై వైసీపీ ప్రభుత్వానికి గౌరవం లేదు
  • ఇంత ఉన్మాది సీఎంను ఎక్కడా చూడలేదు

‘శాసనమండలి లైవ్ సమావేశాలు ప్రసారం కాకుండా కట్ చేసే హక్కు నీకెవరు ఇచ్చారు?’ అంటూ సీఎం జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సూటి ప్రశ్న వేశారు. శాసనమండలి సమావేశాలు జరిగిన తీరు, బిల్లులు ప్రవేశపెట్టిన రోజునాటి పరిస్థితి గురించి వివరిస్తూ మంత్రులు, వైసీపీ నేతలపై  ఆయన విరుచుకుపడ్డారు.

మంగళగిరిలో ఇవాళ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, ‘మేము కూర్చున్న రూమ్ లో ఇంటర్నల్ కనెక్షన్స్ కూడా కట్ చేసి పారేశారు’ అని మండిపడ్డారు. ఈ విషయమై శాసనమండలి చైర్మన్ షరీఫ్ ప్రశ్నించారని, టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో కట్ అయిపోయిందని చెప్పి ఐదు నిమిషాల సేపు కనెక్షన్ ఇచ్చి మళ్లీ కట్ చేశారని విమర్శించారు.

ప్రజాస్వామ్యంపై వైసీపీ ప్రభుత్వానికి గౌరవం లేదని, మీడియా స్వేచ్ఛకు కట్టుబడి లేదని దుయ్యబట్టారు. తన రాజకీయ జీవితంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను కానీ, ఇంత దౌర్జన్యంగా, ఉన్మాదిగా, ఏకపక్షంగా ఉండే సీఎం ను మాత్రం చూడలేదని నిప్పులు చెరిగారు. మండలిలో బిల్లులు పెట్టినప్పుడు 22 మంది మంత్రులు వచ్చారని, చైర్మన్ షరీఫ్ పై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.

షరీఫ్ ను గుక్క తిప్పుకోకుండా చేశారని, ఏకంగా, షరీఫ్ ఛాంబర్ లోకి వీళ్లు వెళ్లి ఆయన్ని బయటకు రానీయకుండా చేసేశారని విమర్శించారు. విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి.. వీళ్లందరూ మండలి గ్యాలరీలో కూర్చున్నారు. సమావేశం వాయిదాపడగానే షరీఫ్ ఛాంబర్ లోకి వెళ్లి ఆయనపై ఒత్తిడి పెంచారని ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను ప్రలోభపెట్టాలని చూశారని వైసీపీ నేతలపై మండిపడ్డారు. ఈ సందర్భంగా బిల్లులకు మద్దతు ప్రకటించే సమయంలో వైసీపీకి సపోర్టు చేసిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీల గురించి ఆయన ప్రస్తావించారు.

More Telugu News